శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2022 (13:00 IST)

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ-సుప్రీంకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దాఖలైన అన్ని చార్జ్ షీట్లను కూడా అక్కడే బదిలీ చేయాలని ఆదేశించింది. ‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు ఈ కేసుకు అర్హత ఉంది. దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదంటూ పిటీషనర్ (వైఎస్ సునీత) వెల్లడించిన ఆందోళనలు పూర్తిగా ఆధారం లేనివని చెప్పలేం’ అని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం కోర్టు వ్యాఖ్యానించింది.

 
ఆధారాలను ధ్వంసం చేశారంటూ నమోదైన కుట్ర కేసును కూడా సీబీఐ విచారించాలని కోర్టు ఆదేశించింది. ‘సుప్రీం కోర్టు తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ ఈ తీర్పు వచ్చిన తరువాత వైఎస్ సునీత బీబీసీతో అన్నారు. దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని చెబుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి హత్య కేసును పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

 
ఏంటీ కేసు?
2019 మార్చి 15న కడపలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి కనిపించారు. మొదట ఆయనది సహజ మరణంగా ప్రచారంలోకి వచ్చింది. వై.ఎస్. వివేకానంద రెడ్డి గుండె పోటుతో మరణించారని వైఎస్‌ఆర్ సీపీ నేత విజయ సాయి రెడ్డి మీడియాకు తెలిపారు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి రక్తపు మడగుల్లో పడి ఉండటం, మృతదేహం మీద గాయాలు వంటివి కనిపించాయి. ఆ వీడియోలను మీడియా కూడా ప్రసారం చేసింది. ఆ తరువాత ఆయనది హత్య అని... దాని వెనుక మంత్రి ఆదినారాయణ రెడ్డి, నారా లోకేశ్ హస్తం ఉందని విజయ సాయి రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.

 
2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా బాబాయి వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే హత్య చేయించాడని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూడా ఆరోపించారు. సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మధ్య ఉన్న విభేదాల వల్లే ఆ హత్య జరిగిందని నాడు టీడీపీ ప్రభుత్వోంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ ఆరోపణల మధ్య హత్య మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

 
ఆరోజు ఏం జరిగింది?
2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తేదీ తెల్లవారు జామున వై.ఎస్. వివేకానందరెడ్డి తన ఇంట్లో బాత్రూమ్‌‌లో విగతజీవిగా కనిపించారు. ముందు రోజు జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించి రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చారు. ఆ రోజు ఆయన ఇంట్లో ఒంటరిగానే ఉన్నారని ఆ తర్వాత పోలీసులు మీడియాకు తెలిపారు. ఆయన చనిపోయి పడి ఉన్న విషయం ఇంట్లో పని మనుషులు గుర్తించి చెప్పడంతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

 
మొదట సహజ మరణంగా ప్రచారమైంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్టు మీడియాకు తెలిపారు. తర్వాత్తర్వాత అది హత్యంటూ మీడియా సమావేశంలో టీడీపీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. నాటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, మంత్రి ఆది నారాయణ రెడ్డి మీద తమకు అనుమానాలున్నాయని అన్నారు. ఏపీ పోలీసుల మీద తమకు నమ్మకం లేదని కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా నాటి మంత్రి, టీడీపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి.. వైఎస్ కుటుంబం మీద ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డికి, కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల మూలంగానే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. సిట్ దర్యాప్తులో వాస్తవాలు తేలుతాయన్నారు.

 
దర్యాప్తులో ఏం చేశారు?
ఈ ఘటనపై 2019 మార్చి 15న నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం 'సిట్' ను నియమించింది. ఆపరేషన్స్ ఏఎస్సీ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు బృందం నియమించారు. వేలిముద్రలతో పాటుగా పలు ఆధారాలను ఈ బృందం సేకరించింది. మృతుడి తలపై కుడి వైపున ఏడు లోతైన గాయాలు ఉన్నాయని, చేతి పైనా గాయాలున్నాయని గుర్తించారు. ఆ తర్వాత మూడు బృందాలుగా ఏర్పడి 'సిట్' దర్యాప్తు కొనసాగించింది.

 
ఫోరెన్సిక్ నివేదిక మేరకు ఇది హత్య అనే నిర్ధరణకు వచ్చారు. 2020 ఫిబ్రవరి వరకూ దశల వారీగా విచారణ సాగింది. సుమారుగా 1,300 మంది సాక్షులను విచారించారు. ముగ్గురు అనుమానితులకు నార్కో టెస్టులు చేశారు. విచారణకు హాజరైన వారిలో వై.ఎస్. కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో సి.ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన బీటెక్ రవి తోపాటుగా వివేకానందరెడ్డికి చికిత్స చేసిన సన్ రైజ్ ఆస్పత్రి వైద్యులు కూడా ఉన్నారు.

 
సీబీఐ ఎందుకు తెర మీదకు వచ్చింది?
2020 ఫిబ్రవరి వరకూ, అంటే హత్య తర్వాత ఏడాది వరకూ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాగించిన విచారణపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ ఎన్. సునీతా రెడ్డి, అల్లుడు నారెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు సి.ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వంటి వారు ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐకి అప్పగించాలని పలువురు కోరారు. హత్యకు సంబంధించిన అనేక అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

 
ఈ కేసులో 2020 మార్చి 11న తీర్పు వెలువడింది. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రస్తుతం 'సిట్' ఆధ్వర్యంలో సాగుతున్న విచారణను కొనసాగించాలని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ వై.ఎస్. జగన్ ప్రభుత్వం వాదన వినిపించడం చర్చనీయమైంది. మొదట సీఆర్పీసీ 174 సెక్షన్ కింద నమోదయిన ఈ కేసుని సీబీఐ సెక్షన్ 302 కింద మార్చింది. దిల్లీకి చెందిన డీఎస్పీ దీపక్‌ గౌర్‌‌ని గత ఏడాది అక్టోబర్‌లో విచారణ అధికారిగా నియమించారు. జులై 2020లో ఏడుగురు సభ్యుల సీబీఐ అధికారుల బృందం కడప, పులివెందులలో పర్యటించింది. పలువురిని విచారించింది. వివేకానందరెడ్డి ఇంట్లో గతంలో డ్రైవర్‌గా పని చేసిన మున్నా సహా అనేక మంది ఈ విచారణకు హాజరయ్యారు. బీటెక్ రవి, సి.ఆదినారాయణ రెడ్డి వంటి నేతలను, పలువురు కుటుంబ సభ్యులను కూడా సీబీఐ విచారించింది.

 
వివేకానంద కుమార్తె ఆందోళన
వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా నిందితులను గుర్తించలేకపోవడం పట్ల ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2021 ఏప్రిల్ 2న ఆమె దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, రెండేళ్లు అవుతున్నా కేసు దర్యాప్తు పూర్తి కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ''ఓ మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, సిట్టింగ్ ముఖ్యమంత్రి చిన్నాన్న కేసే ఇలా ఉంటే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? ఈ కేసు గురించి మరిచిపొమ్మని కొందరు నాతో చెప్పారు. హత్య జరిగిన కొన్నాళ్లకు అనుమానితుడు శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆయన సీఎంకి, ఇతర పులివెందుల నేతలకు వేర్వేరుగా రాసిన లేఖలు బయటపడ్డాయి.

 
ఈ హత్య కేసులో తన పాత్ర లేదని అతను వేడుకున్నారు. ఈ కేసుకు నా తండ్రి హత్యతో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో గాయాలు గుర్తించారు. వైద్యురాలిగా నాకు తెలిసి పాయిజన్ తీసుకున్న వాళ్లకు కిడ్నీ సమీపంలో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఉండదు. వివేకానంద హత్య కేసులో ఆధారాలు లేకుండా చేసిందెవరు.. నిజాలు బయటకురావాలంటే ఎన్నాళ్లు వేచి చూడాలి'' అని ఆమె ప్రశ్నించారు. ఈ కేసులో విచారణ పూర్తి త్వరగా చేయాలని ఆ తర్వాత వై.ఎస్. విజయమ్మ కూడా కోరారు.