గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (18:00 IST)

ఉద్యోగులకు షాకిచ్చిన ఎయిరిండియా - వేతనం లేకుండా ఐదేళ్ల సెలవు!! (Video)

దేశంలోని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిరిండియా తమ ఉద్యోగులకు తేరుకోలేని షాకిచ్చింది. అసలో కరోనా కష్టాలతో ఉన్న ఉద్యోగులకు ఎయిరిండియా యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలోకి జారుకున్నారు. ఎలాంటి వేతనం లేకుండానే ఐదేళ్ళ సెలవును ప్రకటిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. నానాటికీ పెరిగిపోతున్న ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా, పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది. 
 
ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సీఎండీ (ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) రాజీవ్ భన్సాల్‌కు అప్పగిస్తూ, ఎయిర్ ఇండియా బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది.
 
ఉద్యోగుల సూటబిలిటీ, ఎఫిషియన్సీ, కాంపిటెన్సీ, క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, హెల్త్ తదితరాలతో పాటు ఇటీవలి కాలంలో పెట్టిన సెలవులు తదితరాలను మదించి ఎవరిని సెలవులపై పంపించాలన్న విషయమై సిఫార్సులు చేస్తారని ఏఐ అధికారులు వెల్లడించారు. 
 
బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం, తొలుత ఆరు నెలలపై ఉద్యోగులను సెలవుపై పంపించే అధికారం రాజీవ్ బన్సాల్‌కే ఉంటుంది. ఆపై సెలవును రెండు సంవత్సరాలకు, ఆపై అవసరమైతే ఐదేళ్ల వరకూ పొడిగించేందుకు కూడా సీఎండీకి అధికారం ఉంటుంది.
 
ఎయిరిండియా ప్రధాన కార్యాలయాల హెడ్స్, రీజనల్ డైరెక్టర్లు తమ పరిధిలోని ఉద్యోగుల పనితీరును మదించనున్నారు. వారి పేర్లను హెడ్ క్వార్టర్స్ లోని పర్సనల్ విభాగం జీఎంకు పంపుతారు. 
 
ఆపై దాన్ని సీఎండీ అనుమతి నిమిత్తం పంపనున్నారు. కాగా, ఎయిరిండియాను విక్రయించాలని కేంద్రం భావిస్తున్న సమయంలో సంస్థ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.