శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 3 జులై 2019 (19:06 IST)

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం క్వింటాల్ వరి ధాన్యంపై రూ.65, నువ్వులపై రూ.236, పత్తిపై రూ.105, పెసర్లపై రూ.100, కందులపై రూ.125, పొద్దుతిరుగుడు పువ్వుపై రూ.262, సోయాబీన్‌పై రూ.311 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం మద్దతు ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ పని చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.