1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 మే 2021 (19:17 IST)

తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో 4G నెట్వర్క్ సామర్ధ్యం విస్తరణ

వినియోగదారులకు మరింత మెరుగైన 4G సేవలను అందించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అంతటా 20 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను అదనంగా జోడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియోకు ప్రస్తుతం ఉన్న 40 MHz స్పెక్ట్రం లభ్యత ఇప్పుడు 50 శాతం పెరిగి 60 MHz వరకు చేరుకుంది.
 
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇటీవల నిర్వహించిన వేలంలో,  ఏపీ టెలికాం సర్కిల్ కోసం 850MHz బ్యాండ్‌లో 5 MHz ను; 1800MHz బ్యాండ్‌లో 5MHz; 2300 MHz బ్యాండ్‌లో 10 MHz స్పెక్ట్రమ్‌ను జియో చేజిక్కించుకుంది. ఈ అదనపు స్పెక్ట్రమ్ విస్తరణ ప్రాజెక్ట్‌ను రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తన అన్ని టవర్ సైట్‌లలో జియో విజయవంతంగా అమలు చేసింది.

ఫలితంగా, ఈ ప్రాంతంలోని వినియోగదారులందరికీ ఇక నుంచి మరింత మెరుగైన వేగవంతమైన 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెట్‌వర్క్ సామర్థ్యం 50 శాతం పెరగడంతో పాటు డేటా వేగం రెట్టింపు కానుంది.
 
ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతోంది. 
ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచే సురక్షితంగా ఆఫీస్ పనిచేసే వారికి, ఆన్లైన్ క్లాస్‌లు హాజరయ్యే విద్యార్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు డేటా అవసరం మరింత ఉంది. నెట్వర్క్ సామర్ధ్యం పెరగడం వల్ల ఈ వర్గాల వారందరికీ మెరుగైన, నాణ్యమైన కనెక్టివిటీని అందించేందుకు జియో కృషి చేస్తోంది.
 
ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన స్పెక్ట్రం వేలంలో 22 సర్కిల్‌ల కోసం జియో మొత్తం 488.35MHz (850MHz, 1800MHz మరియు 2300MHz బ్యాండ్ లలో) స్పెక్ట్రంను 20 సంవత్సరాల కాలానికి రూ.57,123 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ లభ్యత 55 శాతం వృద్ధితో 1717 MHz కు గణనీయంగా పెరిగింది.