ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (13:25 IST)

ఎస్బీఐ ఖాతాదారులకు చార్జీల బాదుడే బాదుడు.. జూలై నుంచి స్టార్ట్!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థగా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్ బ్యాంకు తన కష్టమర్లు చేదువార్త ఒకటి చెప్పింది. బేసిక్‌ సేవింగ్స్‌ అంటే జీరో బ్యాలెన్స్‌ ఖాతా (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-బీఎస్బీడీ) కల‌వారి నుంచి వ‌చ్చే జూలై ఒక‌టో తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది.
 
బ్యాంకు ఖాతాల్లోని నగదును ఉపసంహరణ, చెక్‌బుక్‌పై పరిమితులు విధించింది. నిర్ణీత పరిధి దాటితే రుసుముల వ‌సూళ్లు వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఏదేనీ ఎస్బీఐ శాఖ‌లోగానీ, ఏటీఎంలోగానీ మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రాయ‌ల్‌కు అనుమతి ఇచ్చింది. అంతకంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవాలనుకుంటే.. ప్రతిసారి రూ.15లతో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 
 
ఇక ఇతర బ్యాంకుల‌ ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. ఇకపై ఎస్బీఐ ఖాతాదారులు ఎస్బీఐయేతర ఏటీఎంలు, ఎస్‌బీఐ శాఖ‌తో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే విత్‌డ్రా చేసే వెసులుబాటువుంది. అంతకుమించి వాడితే మాత్రం ఖచ్చితంగా చార్జీలు బాదుడు తప్పదు. 
 
ఇక బీఎస్బీడీ ఖాతాదారుల‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లీవ్స్‌తో కూడిన చెక్‌బుక్‌ను ఎస్బీఐ ఉచితంగా అందజేస్తుంది. అంతకంటే ఎక్కువ లీవ్స్ గ‌ల చెక్ బుక్ కావాలంటే అద‌న‌పు చార్జీలు చెల్లించాల్సిందే. 10 లీవ్స్‌కల చెక్‌బుక్‌కు రూ.40లతోపాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలి.
 
ఒకవేళ 25 చెక్‌ లీవ్స్ కలిగిన బుక్‌ కావాలంటే జీఎస్టీతో పాటు రూ.75 కట్టాలి. అత్యవసరంగా చెక్‌ బుక్ కావాలని కోరితే.. 10 లీవ్స్‌కి రూ.50తో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలి. అయితే, సీనియర్‌ సిటిజన్లకు మాత్రం చెక్‌ బుక్‌ ఛార్జీలు వర్తించబోవ‌ని ఎస్బీఐ వెల్ల‌డించింది.