1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (09:57 IST)

దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి... గుజరాత్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తి!

దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గిపోతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,59,591 మందికి కరోనా బారినపడ్డారు. వైరస్‌ బారినపడిన వారిలో 3,57,295 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 4,209 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశంలో మొత్తం కొవిడ్‌ కేసులు 2,60,31,991కి పెరిగాయి. ఇప్పటివరకు 2,27,12,735 మంది కోలుకున్నారు. మరో 30,27,925 యాక్టివ్‌ కేసులున్నాయి. 2,91,331 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణశాఖ తన నివేదికలో పేర్కొంది. 19.18 కోట్ల మందిపైగా వ్యాక్సిన్‌ వేసినట్లు స్పష్టంచేసింది. 
 
మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సిన్ డిమాండ్‌ను అందుకునేందుకు కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం కొవాగ్జిన్‌ను హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.
 
అయితే, ఇకపై గుజరాత్‌లోనూ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అంక్లేశ్వర్‌లోని చిరోన్ బెహ్రింగ్ వ్యాక్సిన్ కేంద్రంలోనూ కొవాగ్జిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది.
 
అంక్లేశ్వర్‌లోని వ్యాక్సిన్ కేంద్రం నుంచి ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి ఉత్పత్తి ప్రారంభంకానుంది. కొవాగ్జిన్ టీకా ప్రత్యేకత కారణంగా దీన్ని ఉత్పత్తి చేయడానికి బీఎస్ఎల్-3 ప్రమాణాలు ఉన్న ల్యాబ్‌లు అవసరం అవుతాయి. కాగా, తమ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల సంఖ్య మూడుకు పెరిగిన నేపథ్యంలో, ఏడాదికి వంద కోట్ల డోసులు ఉత్పత్తి సాధ్యమేనని భారత్ బయోటెక్ భావిస్తోంది.