శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:19 IST)

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 12మంది బాలికలకు పాజిటివ్

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపింది. సంగారెడ్డి ఝరాసంఘం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజీబీవీ)లో కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. ఏకంగా 12 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ముగ్గురికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో స్కూల్ లో ఉన్న అందరికీ కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్ లు చేయించారు అధికారులు. 
 
కరోనా పాజిటివ్ వచ్చిన 12 మంది విద్యార్థులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు అధికారులు. మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 132 మంది స్టూడెంట్స్, 18 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరికీ నెగటివ్ రాగా, 12 మంది బాలికలకు మాత్రం పాజిటివ్ వచ్చింది. 
 
ర్యాపిడ్ టెస్ట్‌లలో నెగటివ్ వచ్చిన వారందరికీ తిరిగి ఆర్టీపీసిఆర్ ద్వారా శాంపిల్స్ కలెక్ట్ చేశారు అధికారులు. అయితే.. ఈ రిపోర్టులు రేపు రానున్నాయి. ఆ రిపోర్టుల్లో ఇంకా ఎవరికైనా పాజిటివ్‌ వస్తుందోననే భయంలో ఇటు సిబ్బంది అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.