1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: సోమవారం, 17 మే 2021 (17:15 IST)

ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు: సీఎం వైఎస్ జగన్

అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:
 
ఫీవర్‌ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించండి. ఆ పరీక్షల్లో వైరస్‌ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించండి. అలాగే మందులు కూడా అందించండి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టాలి. వాటిలో అన్ని సదుపాయాలు కల్పించాలి.
 
బ్లాక్‌ ఫంగస్‌:
కాగా డయాబెటిక్, విపరీతంగా స్టెరాయిడ్స్‌ వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించామని సమావేశంలో అధికారులు వివరించగా, ఆ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు.
 
ఆరోగ్యశ్రీ లోకి..:
బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. అదే విధంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోటిఫైడ్‌ ఆస్పత్రులను గుర్తించాలని చెప్పారు సీఎం.
 
నెలాఖరు వరకు కర్ఫ్యూ:
రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం ఆదేశించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూ ఉండాలన్నారు. మనం కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం, యథాతథంగా కర్ఫ్యూ సమయం, నియమావళి అమలు చేయాలన్నారు.
 
వారి సేవలూ వినియోగించుకోండి:
గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
 
ఆ పిల్లలను ఆదుకోండి:
కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్దేశం. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా ఆలోచన చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
 
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితి, వైద్య సదుపాయాలను సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు.
 
రాష్ట్రంలో బెడ్లు–సదుపాయాలు:
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసుత్తం 625 కోవిడ్‌కేర్‌ ఆస్పత్రులలో 47,825 బెడ్లు ఉన్నాయని, వాటిలో 38,492 బెడ్లు ఆక్యుపైడ్‌ కాగా, వారిలో 25,539 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రులలో ప్రస్తుతం 6,576 ఐసీయూ బెడ్లు. 23,463 నాన్‌ ఐసీయూ ఆక్సీజన్‌ బెడ్లు. 17,246 నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సీజన్‌ బెడ్లు. 3,467 వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంకా 115 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోని 52,471 బెడ్లలో 17,417 ఆక్యుపైడ్‌ అని వారు వివరించారు.
 
ఆక్సీజన్‌ సరఫరా:
రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నుల కేటాయించగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో కలిపి రోజూ 590 మెట్రిక్‌ అన్నుల నుంచి 610 టన్నుల వరకు ఆక్సీజన్‌కు డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఒక ఆక్సీజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 80 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో జామ్‌నగర్‌ నుంచి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అదే విధంగా రోజూ కనీసం 130 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ను బళ్లారి నుంచి సరఫరా చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ 8 ఐఎస్‌ఓ కంటైనర్లు రాగా, మరో రెండు కంటైనర్లు కూడా వస్తున్నాయని వారు వెల్లడించారు.
 
మాస్కులు–ఇంజక్షన్లు:
రాష్ట్రంలో ఇప్పుడు అత్యవసరమైన వాటిలో 7,32,542 ఎన్‌–95 మాస్క్‌లు, 7,55,395 పీపీఈ కిట్లు, 44,11,353 సర్జికల్‌ మాస్క్‌లతో పాటు, 23,382 రెమిడిసివిర్‌ ఇంజక్షన్ల స్టాక్‌ ఉండగా, ఇంకా 8 లక్షల ఇంజక్షన్లు మైలాన్‌ నుంచి. మరో 50 వేలు రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచి సేకరించేందుకు ఆర్డర్‌ ప్లేస్‌ చేయడం జరిగిందని అధికారులు వివరించారు.
 
కోవిడ్‌ వ్యాక్సిన్లు:
కేంద్రం నుంచి మొత్తం 75,99,960 వ్యాక్సిన్‌ డోస్‌లు రాగా, వాటిలో కోవీషీల్డ్‌ 62,60,400 వ్యాక్సిన్లు కాగా, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు 13,39,560 అని అధికారులు వెల్లడించారు. ఇక ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రానికి కోవీషీల్డ్‌ వ్యాక్సిన్లు 6,90,360 కేటాయించగా, అంత కంటే ఇంకా ఎక్కువగా 8,90,360 డోస్‌లు సేకరించామని వారు తెలిపారు. మరోవైపు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు 2,27,490 కేటాయించగా, కేవలం 1,25,000 మాత్రమే సరఫరా చేశారని అధికారులు పేర్కొన్నారు.
 
డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.