శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (13:52 IST)

తెలంగాణలో 101 కరోనా కేసులు.. దేశంలోనూ తగ్గుతున్న కోవిడ్

తెలంగాణలో గత 24 గంటల్లో 18,252 కరోనా పరీక్షలు నిర్వహించగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 197 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,682 కి చేరింది.
 
ఇప్పటివరకు మొత్తం 2,92,229 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,611కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,842 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 751 మంది హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే.. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. భారత్‌లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11వేల 831 మందికి కరోనా నిర్ధారణ అయింది. 11వేల 904 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 84 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య లక్షా 55వేల 080 కు పెరిగింది.
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 58లక్షల 12వేల 362 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి(ఫిబ్రవరి 7,2021) వరకు మొత్తం 20,19,00,614 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5లక్షల 32వేల 236 శాంపిళ్లను పరీక్షించారు.