1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (16:32 IST)

ఢిల్లీలో మొదలైన కమ్యూనిటీ స్ప్రెడ్ : ఆరోగ్య శాఖామంత్రి జైన్

దేశ రాజధాని ఢిల్లీ మరోమారు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేందర్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ కూడా క్రమంగా జనాల్లోకి వెళ్లిపోయి వ్యాప్తి మొదలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలో కొత్తగా నమోదైన 46 శాతం కేసుల్లో ఒమిక్రాన్ కేసులేనని ఆయన గుర్తుచేశారు. అందుకే ఢిల్లీలో జన్యుక్రమ విశ్లేషణ మొదలుపెట్టినట్టు చెప్పారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 923 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మే 30వ తేదీ నుంచి నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.