శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (11:01 IST)

వణికిపోతున్న అమెరికా.. ఎందుకో తెలుస్తే షాకవుతారు?

అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. దీనికి కారణం కరోనా వైరస్. ఇక్కడ కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రారంభమైంది. ఫలితంగా గురువారం ఒక్కరోజే ఏకంగా 3,054 కరోనా మరణాలు సంభవించాయి. అంతకు 24 గంటల ముందు 2,769 మంది కరోనా కాటుకు బలయ్యారు. 
 
18 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 2,10,000 మందికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అమెరికాలో ఇప్పటివరకు 1.50 కోట్ల మంది వైరస్ బారినపడగా, వారిలో 2,86,249 మంది వైరస్‌కు బలైనట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా పలు ఫార్మా కంపెనీలు తయారు చేసిన టీకాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా దెబ్బకు ప్రతి రోజూ వేలాదిమంది మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 
 
మరోవైపు, ఈ ఏడాది చివరినాటికి 20 మిలియన్ల మందికి, జనవరి చివరినాటికి 50 మిలియన్ల మందికి, వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి 100 మిలియన్ల మంది అమెరికన్లకు కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ దేశ ఆరోగ్య, మానవసేవల కార్యదర్శి అలెక్స్ అజార్ తెలిపారు.