శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (17:34 IST)

భారత్ జోరుకు బ్రేకేసిన టేలర్ : 347 రన్స్ టార్గెట్‌ను ఊదేసిన కివీస్

ఎట్టకేలకు సొంతగడ్డపై న్యూజిలాండ్ బోణీ కొట్టింది. ఈ వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ఐదు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే టోర్నీలో మాత్రం బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రత్యర్థి భారత్ తమ ముందు ఉంచిన 347 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మరో 11 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని కివీస్ ఆటగాడు మార్క్ టేలర్ అడ్డుకున్నాడు. ఫలితంగా కివీస్ జట్టు వన్డే సిరీస్‌లో విజయం సాధించింది. 
 
సెడాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్.. తొలి వికెట్‌కు 50 పరుగులు భాగస్వామ్యం సాధించారు. పృథ్వీ షా తన వ్యక్తిగత స్కోర్ 20 పరుగుల దగ్గర గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ కొద్దిసేపటికే మయాంక్(32) అవుట్ అయ్యాడు. 
 
ఆ పిమ్మట క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 51 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 156 పరుగుల దగ్గర మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే, యువ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ల జోడీ ఆచితూచి ఆడుతూ.. జట్టు భారీ స్కోర్ సాధించేందుకు తోడ్పడ్డారు. ఇదే క్రమంలో 107 బంతుల్లో 103 పరుగులు చేసిన శ్రేయాస్ భారీ షాట్‌కు యత్నించి సాట్నర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత లోకేశ్‌కు కేదార్ జాదవ్ జత కలిశాడు. ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. 
 
మ్యాచ్ ఆకరులో కేదార్ జాదవ్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 15 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరి జోడీ 56 పరుగుల భాగస్వామ్యం సాధించింది. కివీస్ బౌలర్లలో సోథీ రెండు వికెట్లు, గ్రాండ్‌హోమ్, సోదీ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ జట్టు ముంగిట 348 పరుగుల విజయలక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది. 
 
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు కొండంత లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా, మరో 11 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా మార్టిన్ గప్టిల్ (32), హెన్రీ నికోలస్‌ (78)లు అద్భుత ఆరంభాన్నిఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. 
 
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్, కెప్టెన్ టామ్ లాథమ్‌లు వీరోచితంగా ఆడుతూ వరుస పరాజయాలకు బ్రేక్ వేశారు. రాస్ టేలర్ 84 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయ సెంచరీ (109) చేయగా, లాథమ్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు వెంటవెంటనే మూడు వికెట్లు తీయడంతో ఈ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్‌కు దారితీస్తుందేమో అని భారత అభిమానులు భావించారు. 
 
అయితే, టేలర్, శాంట్నర్‌లు ఆ అవకాశం ఇవ్వలేదు. షమీ వేసిన 49వ ఓవర్ తొలి బంతిని ఫైన్‌లెగ్‌వైపు తరలించిన టేలర్ కివీస్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, షమీ చెరో వికెట్ తీసుకున్నారు.