శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (23:04 IST)

ఆసియా కప్ : మళ్లీ తలపడనున్న భారత్ - పాకిస్థాన్.. ఎపుడు.. ఎలా...

ind vs pak
దుబాయ్ వేదికగా ఆసియా దేశాల మధ్య క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఈ ఆసియా కప్ టోర్నీలో ఇప్పటివరకు సూపర్-4కు ఆప్ఘనిస్థాన్, భారత్, పాకిస్థాన్ జట్లు చేరుకున్నాయి. అయితే, శుక్రవారం వరకు ఆయా జట్లు సాధించిన గెలుపోటముల మేరకు వచ్చే ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోమారు తలపడనున్నాయి. తాజాగా జరిగిన హాంకాంగ్‌తో పాకిస్తాన్ ఆడిన మ్యాచ్‌తో ఈ విషయం స్పష్టమైంది. 
 
శుక్రవారం హాంకాంగ్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఆటగాడు రిజ్వాన్ (78 నాటౌట్), ఫకర్ జమాన్ (53), ఖుష్‌దిల్ షా (35 నాటౌట్)లు చెలరేగి ఆడటంతో పాక్ జట్టు భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు పాక్ బౌలర్ల ధాటికి కేవలం 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఇచ్చిన 10 అదనపు పరుగులు, ఆ తర్వాత కెప్టెన్ నిజాఖత్ ఖాన్ చేసిన 8 పరుగులు అత్యధికం కావడం గమనార్హం. పాక్ బౌలర్ల బౌలింగ్‌ను హాంకాంగ్ ఆటగాళ్ళు ఏ దశంలోనూ అర్థం చేసుకోలేక పోయారు. 
 
ఈ విజయంతో పాకిస్థాన్ జట్టు సూపర్-4లోకి అడుగుపెట్టింది. దీంతో వచ్చే వారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరో క్రికెట్ సమరం జరుగనుంది. సూపర్-4 గ్రూపులో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఆ తర్వాత ఈ నెల 11వ తేదీన ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. 
 
అయితే, సూపర్-4లో తొలి మ్యాచ్ సెప్టెంబరు 3వ తేదీన ఆప్ఘనిస్థాన్ - శ్రీలంక జట్ల, రెండో సూపర్ మ్యాచ్ సెప్టెంబరు 4న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా, మూడో సూపర్ మ్యాచ్ శ్రీలంక - భారత్ మధ్య సెప్టెంబరు 6వ తేదీన, నాలుగో సూపర్ మ్యాచ్ పాకిస్థాన్ - ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబరు 7వ తేదీన జరుగుతుంది.