గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (12:14 IST)

బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత : మహిళల టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు!

icccricekt
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడమే కాకుండా ఆమె ఏకంగా దేశం విడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వేదిక మారినప్పటికీ, ఈవెంట్‌కు హోస్ట్‌గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని ఐసీసీ వెల్లడించింది.
 
కాగా, ఐసీసీ నిర్వహించిన వర్చువల్ బోర్డు సమావేశంలో వేదికను మార్చాలని నిర్ణయించారు. అక్టోబరు 3 నుంచి 20 వరకు బంగ్లాలో జరుగాల్సిన ఈ మెగాటోర్నీలో ఆడేందుకు సభ్యదేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తి చూపించకపోవడంతో ఐసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అక్టోబరు 3 నుంచి 20 మధ్య యూఏఈలోని దుబాయ్, షార్జాలోని రెండు వేదికలలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. 
 
అయితే, వేదిక మార్పుపై ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డై డైస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేసమయంలో దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు బీసీబీ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. అలాగే టోర్నీ నిర్వహణకు అంగీకరించిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న యూఏఈ ఇటీవలికాలంలో క్రికెట్‌కు ప్రధాన కేంద్రంగా మారుతోంది.
 
ఇప్పటికే ఒమన్‌తో కలిసి యూఏఈ అనేక ఐసీసీ క్వాలిఫైయర్ టోర్నమెంట్లను నిర్వహించింది. అలాగే 2021లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు వేదికగా నిలిచింది. దీంతో పాటు 2020లో కరోనా కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తం ఇక్కడే జరిగింది. అలాగే 2021 ఐపీఎల్ సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఇక్కడే నిర్వహించిన విషయం తెలిసిందే.