1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (14:15 IST)

ఐసీసీ వరల్డ్ టీ20 వార్మప్ మ్యాచ్ : ఆసీస్ మ్యాచ్‌పై భారత్ విజయం

team india
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ వరల్డ్ టీ20 ప్రపంచ కప్ సాగుతోంది. ఇందులోభాగంగా, ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై క్రికెట్ పసికూన నమీబియా ఘన విజయం సాధించింది. సోమవారం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. అదీకూడా చెమటోడ్చి నెగ్గింది.  
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆసీస్ 180 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ (76) అర్థశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (35), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (23) ఫర్వాలేదనిపించారు. 
 
మ్యాచ్ ఆఖరి ఓవరులో 15 పరుగులు చేయాల్సిన క్రమంలో.. ఆసీస్‌ ఆరు వికెట్లను కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేసింది. అందులోనూ జట్టు స్కోరు 180 పరుగుల వద్ద నాలుగు వికెట్లను చేజార్చుకోవడం గమనార్హం. 
 
భారత బౌలర్లు ఆరంభంలో పరుగులు ధారాళంగా ఇచ్చారు. ఫించ్‌తోపాటు మార్ష్, మ్యాక్స్‌వెల్‌ సులువుగానే పరుగులు రాబట్టారు. దీంతో 18 ఓవర్లకు 171/5 స్కోరుతో ఆసీస్‌ నిలిచింది. అయితే ఇక్కడ నుంచే అసలైన డ్రామా మొదలైంది. 
 
టీమిండియా బౌలర్లకు ఫోబియా అయిన 19వ ఓవర్‌ను ఈసారి మాత్రం హర్షల్‌ పటేల్ అద్భుతంగా సంధించాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చి కీలకమైన ఫించ్‌ వికెట్‌ తీశాడు. విరాట్ కోహ్లీ చేసిన సూపర్ త్రో దెబ్బకు టిమ్‌ డేవిడ్‌ (5) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 
 
దీంతో చివరి ఓవర్‌లో 10 అవసరం కాగా.. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన షమీ అత్యుత్తమంగా వేశాడు. తొలి రెండు బంతులకు డబుల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బంతికి కమిన్స్‌ (4) ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో అద్భుతంగా ఒడిసిపట్టాడు. 
 
అనంతరం జోష్ ఇంగ్లిస్‌, కేన్ రిచర్డ్‌సన్‌ను షమీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆసీస్‌ 180 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ 3, భువనేశ్వర్‌ 2.. అర్ష్‌దీప్, హర్షల్‌ పటేల్, చాహల్ ఒక్కో వికెట్‌ తీశారు.