శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (10:58 IST)

ప్రపంచ కప్ 2019: సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో భారత్... ఆదమరిస్తే అంతేసంగతులు

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ప్రపంచ కప్‌లో భారత తన ఓటమి చెందింది. దాన్ని వీలైనంత త్వరగా మరిచిపోయి అధికారికంగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకునేందుకు సిద్ధమైపోయింది. 
 
ఇంగ్లండ్ చేతిలో ఓడిన పిచ్‌పైనే భారత్ మంగళవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీసేన 5 విజయాలు, ఒక ఓటమి, ఓ మ్యాచ్ రద్దు కారణంగా 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. గాయాలు, మిడిలార్డర్ వైఫల్యం, జట్టు కూర్పు అంశాల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. బంగ్లాపై చక్కటి విజయంతో వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టాలని టీమ్‌ఇండియా కృతనిశ్చయంతో ఉంది. 
 
మరోవైపు 7 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి మూడు ఓడి.. ఓ మ్యాచ్ రద్దు కావడంతో 7 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్.. కోహ్లీసేనను ఓడించి నాకౌట్‌కు దగ్గరవ్వాలని ఉవ్విళ్లూరుతున్నది. చిన్న జట్టే కదా అని తేలిగ్గా తీసుకుంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. 
 
అయితే, ఈ మ్యాచ్‌కు విజయ్ శంకర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే, ఇప్పటివరకు పెద్దగా రాణించలేని కేఎల్ జాదవ్, చాహల్‌లపై జట్టు మేనేజ్‌మెంట్ వేటు వేయనుంది. వీరి స్థానంలో జడేజా, భువనేశ్వర్‌లకు చోటు దక్కనున్నట్లు జట్టు వర్గాలు చెబుతున్నాయి. భారత్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓ స్పిన్నర్‌ను తగ్గించి పేసర్‌ను పెంచుకుంది. 
 
మైదానంలో ఓవైపు బౌండరీ దూరం 59 మీటర్లే. చాహల్‌, కుల్దీప్‌ల బౌలింగ్‌లో రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ అటువైపు బాగా పరుగులు రాబట్టారు. భారత్‌ బ్యాటింగ్‌కు వచ్చేసరికి బౌండరీ దూరంగా ఉన్న వైపు ఫీల్డర్లను మోగించి అటువైపే బంతులు సంధించారు. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమై ఓ స్పిన్నర్‌ను తగ్గించుకోనున్నట్లు సమాచారం. తమీమ్‌, షకిబ్‌, ముష్ఫికర్‌ వంటి హిట్టర్లను అడ్డుకోడానికి ప్రధానంగా పేసర్లనే ప్రయోగించనున్నారు.
 
ఇకపోతే, ఈ మ్యాచ్ గత ఆదివారం ఇంగ్లండ్‌తో ఆడిన వికెట్‌పైనే ఈ మ్యాచ్ జరుగనుంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ సీమర్లకు అనుకూలం అనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. లెగ్‌సైడ్ బౌండ్రీ మరీ చిన్నదిగా ఉంది. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే చాన్స్ ఎక్కువ.
 
భారత జట్టు : రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లీ, రిషబ్ పంత్, పాండ్యా, ధోనీ, రవీంద్ర జడేజా లేదా కేఎల్ జాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్ లేదా భువనేశ్వర్, బుమ్రా. 
బంగ్లాదేశ్ జట్టు : లిటన్, తమీమ్, షకీబ్, ముష్పికర్, సర్కార్, మహ్మదుల్లా, మొసద్దిక్, సైఫుద్ధీన్, మెహదీ, మొర్తజా, ముస్తఫిజుర్.