శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (12:22 IST)

'ఒకే ఒక్కడు'.. "సరిలేరు నీకెవ్వరు" అంటున్న నెటిజన్లు

భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసి కేవలం సింగిల్‌ లైన్‌తో తన ఉద్దేశం తెలిపాడు. ఈ లైన్ చూసిన క్రికెట్ అభిమానులు, క్రికెట్ పండితులు, క్రికెటర్లు, రాజకీయ నేతలు ఆశ్చర్యానికు లోనయ్యారు. 
 
అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా జట్టుకు ఒక ఐసీసీ ట్రోఫీ అందిస్తే గొప్ప. అలాంటిది ఏకంగా మూడు కప్‌లు సాధించిపెడితే అది అనన్య సామాన్యమైన ఘనత. సారథిగా ధోనీ అలాంటి ఘనతే అందుకున్నాడు. అతడి నాయకత్వంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకుంది. 
 
ప్రపంచ క్రికెట్‌లో ముచ్చటగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. మూడు ట్రోఫీల్లో మొదటిది టీ20 ప్రపంచ కప్‌. పొట్టి వరల్డ్‌ కప్‌ తొలిసారి 2007లో సౌతాఫ్రికాలో జరిగింది. అప్పుడే భారత్‌ పగ్గాలు చేపట్టిన మహీ..ఆ టోర్నీలో జట్టును జగజ్జేతగా నిలిపాడు. టైటిల్‌ ఫైట్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఓడించడంతో ఆ ట్రోఫీ టీమిండియాకు మరింత చిరస్మరణీయమైంది. 
 
ఇక రెండోది..2011 వన్డే ప్రపంచ కప్‌. భారత్‌ ఆతిథ్యమిచ్చిన ఆ మెగా టోర్నీలో జట్టును ముందుండి నడిపించాడు మహీ. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో ఫైనల్లో తనదైన శైలిలో సిక్సర్‌ కొట్టిన ధోనీ (91 నాటౌట్‌) జట్టుకు మరో అద్వితీయ విజయాన్ని కట్టబెట్టాడు. చివరగా 2013 చాంపియన్స్‌ ట్రోఫీతో మహీ సారథ్యంలో టీమిండియా ఖాతాలో మూడో ఐసీసీ కప్‌ చేరింది. 
 
అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లోనేకాదు.. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా ధోనీది తిరుగులేని ముద్ర. అతడి నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2010, 2011, 2018 సంవత్సరాల్లో మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచింది. అలా క్రికెట్ చరిత్రలో ధోనీ అధ్యాయం ముగిసిపోయింది.