గురువారం, 4 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

19న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ అంకానికి ముగింపు.. తుది జట్టులో అశ్విన్

wankhede stadium
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సమరం తుది అంకానికి చేరుకుంది. ఏకంగా 45 రోజుల పాటు సాగిన ఈ క్రికెట్ పండుగ.. ఆదివారం భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగే పోరుతో పరిసమాప్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్దదైన ఇక్కడి మొతేరాలోని స్టేడియంలో రికార్డులను పరిశీలిస్తే, 
 
39 ఏళ్ల (1984-2023) ఈ స్టేడియం చరిత్రలో ఇప్పటివరకు 30 వన్డేలు జరిగాయి. ఇక్కడి పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 243. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్లో భారీ స్కోర్లు నమోదవుతున్న తరుణంలో 243 రన్స్ తక్కువగానే కనిపిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 15 సార్లు గెలిస్తే.. చేజింగ్ చేసిన టీమ్ కూడా అన్నేసార్లు నెగ్గడం గమనార్హం. ఇక ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ గెలిచే అవకాశం 56.67 శాతం. అంటే టాస్ నెగ్గే జట్టుకే విజయావకాశాలను నిర్ధారించనున్నాయి. 
 
ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 965/2. 2010లో భారత్‌పై సౌతాఫ్రికా నమోదు చేసింది. కలిస్, డివి ల్లీర్స్ సెంచరీలతో చెలరేగారు. అత్యల్ప స్కోరు 85. 2006లో వెస్టిండీస్‌పై  జింబాబ్వే చేసింది. వ్యక్తిగత అత్యధిక స్కోరు 152 నాటౌట్. ఈ ప్రపంచ కప్ ప్రారంభ పోరులో ఇంగ్లండ్‌పై డెవాన్ కాన్వే సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 9-3-12-4 2022లో ప్రసిద్ధ కృష్ణ ఈ ఫీట్ చేశాడు. అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన 325/5. 2002లో ఈ లక్ష్యాన్ని 47.6 ఓవర్లలో భారత్ చేరింది. ఇక 1998లో భారత్‌పై 196 పరుగుల అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టు వెస్టిండీస్.
 
ఇదిలావుంటే, ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్ వికెట్ అయితే అశ్విన్‌కు తుది జట్టులో చోటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా - అఫ్ఘానిస్థాన్ మధ్య ఇక్కడ జరిగిన పోరులో.. రెండో ఇన్నింగ్స్‌లో పడిన ఐదు వికెట్లూ స్పిన్నర్లు తీసినవే కావడం విశేషం. పాకిస్థాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లోనూ కుల్దీప్ (10 ఓవర్లలో 2/35), జడేజా (9.5 ఓవర్లలో 38/2) తక్కువ పరుగులిచ్చి చెరో రెండు వికెట్లు సాధించారు. దీంతో స్పిన్‌కు అనుకూలించే పిచ్ అయితే పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కనబెట్టి అశ్విన్‌‍కు చోటు కల్పించే అవకాశం ఉంది.