1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (11:58 IST)

మోతేరా తారా స్టేడియంలో పేసర్లదే పైచేయి.. ఆ నాలుగు మ్యాచ్‌‍ల స్కోర్లు పరిశీలిస్తే,

modi stadium
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 అంతిమ పోరు జరిగే అహ్మదాబాద్‌ నగరంలోని మోతేరా స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పేసర్లు బంతితో అద్భుతంగా రాణించారు. పైగా, ఈ నాలుగు మ్యాచ్‌లలో నాలుగుసార్లు ఛేజింగ్ చేసిన జట్టే గెలిచింది. 
 
అలాగే నాలుగు మ్యాచ్ ఏ జట్టూ 300 పరుగులు చేయలేక పోయింది. మొత్తం 57 వికెట్లు నేలకూలాయి. ఇందులో 36 వికెట్లు పేసర్లకు, 21 వికెట్లు స్పిన్నర్లు పడగొట్టారు. అంటే ఇక్కడ పేసర్లదే పైచేయన్నమాట. ఈ వేదికలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయాలు సాధించాయి.
 
ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో ఇంగ్లండ్ 282/9 - న్యూజిలాండ్ 283/1, పాకిస్థాన్ 191 ఆలౌట్ - భారత్ 192/3, ఆస్ట్రేలియా 286 ఆలౌట్ - ఇంగ్లండ్ 253 ఆలౌట్, అఫ్ఘానిస్థాన్ 244 ఆలౌట్ - దక్షిణాఫ్రికా 247/5 చొప్పున పరుగులు చేశారు. 
 
మరోవైపు, క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంత ర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐ భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ పోరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే, ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆక ర్షణగా వన్డే ప్రపంచ కప్ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్లను కూడా ఆహ్వానించారు. అంటే. క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, ధోనీ, అలెన్ బోర్డర్, స్టీవ్ వా, పాంటింగ్, మైకేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ రాకతో ఫైనల్ మరింత కలర్ఫుల్ మారనుంది. వీరికోసం ప్రత్యేకమైన బ్లేజర్‌ను బీసీసీఐ తయారు చేయించింది. ఆ బ్లేజరు ధరించి వారంతా మ్యాచ్‌ను వీక్షిస్తారు.