ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (11:09 IST)

మా జీవితంలో అత్యంత సుధీర్ఘంగా గడిచిన ఆ 48 గంటలు.. : అశ్విన్ సతీమణి

ashwin family
మా జీవితంలో అత్యంత సుధీర్ఘంగా ఆ 48 గంటలు గడిచాయని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. రాజ్‌కోట్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ 500వ వికెట్‌ను తీసిన విషయం తెల్సిందే. ఈ వికెట్ తీసిన తర్వాత అశ్విన్ సంబరాలు జరుపుకోలేక పోయారు. తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఇందుకు కారణమైంది. మ్యాచ్ మధ్యలోనే హుటాహుటిన అశ్విన్ చెన్నైకు బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఈ మ్యాచ్ రెండవ రోజున ఇంటికెళ్లి అమ్మను పరామర్శించి మళ్లీ రాజ్‌కోట్ టెస్ట్‌కు తిరుగుపయనమయ్యాడు. మ్యాచ్ నాలుగో రోజున టీమ్‌తో కలిశాడు. కీలకమైన ఒక వికెట్ తీసి 501వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా చారిత్రాత్మకమైన విజయంలో భాగస్వామ్యమయ్యాడు. దాదాపు 48 గంటలపాటు అశ్విన్ తీరికలేని ప్రయాణంపై అతడి భార్య ప్రీతి నారాయణన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. 
 
"500వ వికెట్ కోసం మేము హైదరాబాద్ టెస్టులో ప్రయత్నించాం. అది జరగలేదు. వైజాగ్ టెస్టులోనూ సాధ్యపడలేదు. కాబట్టి అప్పటికే కొనివుంచిన స్వీట్లను 499వ వికెట్ వద్దే ఇంటి దగ్గర అందరికీ పంపిపెట్టాను. 500వ వికెట్ దక్కింది. కానీ మేము నిశ్శబ్దంగా ఉండిపోయాం. 500 - 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి. మా జీవితంలో అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటలు ఇవి. నేను చెప్పేదంతా 500వ వికెట్, అంతకుముందు ప్రదర్శన గురించే. నిజంగా ఎంత అసాధారణమైన వ్యక్తి. అశ్విన్ మీ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మేము నిన్ను అభిమానిస్తున్నాము!' అంటూ ప్రీతి నారాయణన్ వ్యాఖ్యానించారు. అశ్విన్ ఫొటోను ఆమె ఈ సందర్భంగా షేర్ చేశారు.