1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2023 (12:06 IST)

సఫారీలతో టెస్ట్ సిరీస్ : ముమ్మరంగా రోహిత్ - విరాట్ నెట్ ప్రాక్టీస్

virat kohli
స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌, దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లను టీమిండియా ఆడింది. కానీ ఈ మూడు సిరీస్‌లకు కెప్టెన్‌ రోహిత్‌, విరాట్‌ల కోరిక మేరకు బీసీసీఐ వారికి నెల రోజుల విశ్రాంతినిచ్చింది. 
 
తాజాగా మంగళవారం నుంచి సఫారీలతో రెండు టెస్టుల సిరీస్‌ జరుగబోతోంది. ఇప్పుడు అభిమానులు ఈ వెటరన్‌ జోడీ ప్రదర్శనను చాలారోజుల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో తిలకించనున్నారు. ఇక.. 31 ఏళ్లుగా అందకుండా ఊరిస్తున్న దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ను అందించే ఉద్దేశంతో నెట్స్‌లో వారిద్దరూ చెమటోడ్చుతున్నారు. సెంటర్‌ ప్రాక్టీస్‌ స్ట్రిప్‌పై ఉన్న రెండు నెట్స్‌లో ఆదివారం వీరు తమ ప్రాక్టీస్‌ను సాగించారు. గంటకు పైగా త్రోడౌన్స్‌ను ఎదుర్కొన్నారు. 
 
అయితే విరామ సమాయాల్లోనూ వీరు పెద్దగా మాట్లాడుకున్నట్టు కనిపించలేదు. ఆరంభంలో రోహిత్‌, జైస్వాల్‌ మొదట నెట్స్‌లో అడుగుపెట్టారు. బుమ్రా, శార్దూల్‌లు వారికి తలా ఐదు బంతులు విసిరారు. ఆ తర్వాత స్పిన్నర్‌ అశ్విన్‌ ఓవర్‌లో స్లాగ్‌ స్వీప్‌ ద్వారా రోహిత్‌ భారీ షాట్‌ ఆడడం కనిపిచించింది. వీరి ప్రాక్టీస్‌ మధ్యలో విరాట్‌ మైదానంలోకి వచ్చి కోచ్‌ ద్రవిడ్‌తో మాట్లాడుతూనే రోహిత్‌ బ్యాటింగ్‌ను గమనించాడు. 
 
తదనంతరం తనూ ప్యాడ్లు కట్టుకుని నెట్స్‌లోకి దిగాడు. మరోవైపు కీపర్లు రాహుల్‌, కేఎస్‌ భరత్‌ కూడా నెట్స్‌లో కనిపించారు. ఇక ప్రత్యర్థి జట్టు రబాడ, ఎన్‌గిడి, జాన్సెన్‌, కొట్జీల రూపంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగే చాన్సుంది. వికెట్‌ కూడా పేసర్లకే అనుకూలించనుంది. ఈ దశలో భారత జట్టులో నాలుగో పేసర్‌గా శార్దూల్‌కు అవకాశం దక్కవచ్చు. అదే జరిగితే వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ బెంచీకే పరిమితం కాక తప్పదు. అటు ప్రసిద్ధ్‌ క్రిష్ణతో పోటీ ఉన్నా ముకేశ్‌ కుమార్‌ తుది జట్టులో ఉండవచ్చు.