మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (12:43 IST)

మిథాలీ రాజ్‌ను పక్కనబెట్టేశారు.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?

మహిళల ట్వంటీ-20 ప్రపంచ కప్ పోటీలు వెస్టిండీస్ గడ్డపై జరిగాయి. ఈ పోటీల్లో ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన ఆస్ట్రేలియా.. విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన సెమీఫైనల్ మ్యాచ్‌పై ప్రస్తుతం రచ్చ జరుగుతోంది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత జట్టు ఇంగ్లండ్‌తో బరిలోకి దిగింది. అయితే 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఖంగుతింది. 
 
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్‌కు జట్టులో స్థానం కల్పించకపోవడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. తాను కెప్టెన్‌గా వ్యవహరించిన సందర్భంగా తనను కూడా ఆడనివ్వకుండా పక్కన కూర్చోబెట్టారని.. ప్రస్తుతం మిథాలీ రాజ్‌ను కూడా కీలక మ్యాచ్‌లో పక్కనబెట్టేయడాన్ని చూస్తే.. వెల్ కమ్ టు ది క్లబ్ అని చెప్పుకోవాలని గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 
వన్డేల్లో మంచి ఫామ్‌లో వున్నప్పుడు తాను కూడా 15 నెలల పాటు వన్డే జట్టులో స్థానం లేకుండా.. పక్కన కూర్చోవాల్సి వచ్చిందని.. క్రికెట్‌లో వున్నవారికి కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని గంగూలీ చెప్పాడు. కానీ ప్రతిభ గల క్రికెటర్ల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయని మిథాలీ రాజ్‌కు మద్దతునిచ్చే వ్యాఖ్యలు చేశాడు.