శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (06:37 IST)

సేలం చిన్నోడి క్రికెట్ కెరీర్ అద్భుతం...

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో రిజర్వు బౌలర్‌గా చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ టి. నటరాజన్. మొన్నటివరకు ఈయన కుర్రోడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఐపీఎల్ టోర్నీలో ఆడాడు. కానీ తాజాగా టీమ్ ఇండియా వన్డే జట్టులో స్థానం దక్కించుకొని తొలి వన్డేలోనే రెండు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 
 
తమిళనాడులోని సేలంలో పుట్టిన నటరాజన్ తొలుత స్థానిక లీగ్‌తోనే వెలుగులోకి వచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో బౌలర్‌గా రాణించడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. పంజాబ్ జట్టు అతడిని వేలంలో కొనుక్కున్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ తర్వాత సన్ రైజర్స్ జట్టు అతడిని గత వేలంలో దక్కించుకుంది. 
 
ఆ జట్టులో చేరిన తొలి ఏడాదే అతడిని జట్టులో ప్రధాన బౌలర్‌గా ఎంచుకుంది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున అద్భుతంగా రాణించిన నటరాజన్ ఏకంగా ఆస్ట్రేలియా పర్యటనకు రిజర్వ్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా టీ20 నుంచి తప్పుకోవడంతో ఆ జట్టులో ఎన్నికయ్యాడు. 
 
ఇక వన్డేల్లో నవదీప్ సైనీ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శార్థుల్ ఠాకూర్‌తో పాటు మరో బౌలర్‌గా నటరాజన్ తుది జట్టులో చేరాడు. కాన్‌బెర్రాలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రాతో పాటు కొత్త బంతితో బౌలింగ్ చేసిన నటరాజన్.. తొలి వికెట్ తీయడం గమనార్హం.