శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (17:05 IST)

భారత క్రికెట్ అభిమానులకు ఓ చేదువార్త.. రిటైర్డ్ హర్ట్‌గా రోహిత్ శర్మ

rohith sharma
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మూడో మ్యాచ్ నుంచి భారత అభిమానులకు ఓ చేదువార్త కూడా వచ్చింది.
 
కాగా, భారత జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు వచ్చాడు. 5 బంతులు ఆడి ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. మొత్తంగా 11 పరుగులు చేసిన తర్వాత కొంత ఇబ్బంది పడుతూ కనిపించాడు. వైద్య బృందం మైదానానికి వచ్చి రోహిత్ శర్మను పరీక్షించారు. దీంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.  
 
రోహిత్ వెన్నులో ఏదో సమస్య ఉంది. కండరాల ఒత్తిడికి సంబంధించిన ఫిర్యాదు కూడా ఉంది. రోహిత్‌కు ఆరోగ్యం బాగోకపోవడంతో రిటైర్‌మెంట్‌ తీసుకుని వైద్య బృందంతో కలిసి డకౌట్‌కు వెళ్లాడు. దీంతో బీసీసీఐ రోహిత్ గాయంపై అప్‌డేట్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని బీసీసీఐ తెలిపింది. వైద్య బృందం ఆయనను పరీక్షిస్తోందని పేర్కొంది.
 
ఒకవేళ గాయం తగ్గినా.. ఆసియా కప్‌ 2022 నేపథ్యంలో బీసీసీఐ హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయం తీవ్రత పెరిగితే.. కీలక టోర్నీగా పరిగణించిన ఆసియా కప్‌ 2022కు రోహిత్ శర్మ దూరం అయ్యే ఛాన్స్ ఉంది.