శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (11:56 IST)

క్వింటన్ డీకాక్‌ తప్పేమీ లేదు.. ఆ విషయంలో తప్పు నాదే.. ఫకర్ జమాన్

Quinton de Kock
సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య రెండో వన్డేలో క్వింటన్ డీకాక్ చేసిన పని వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ (193: 155 బంతుల్లో 18x4, 10x6) డబుల్ సెంచరీ చేసేందుకు మరో 7 పరుగుల దూరంలో ఉన్నాడు. అనుకున్నట్లు జరిగితే.. తన కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేసేవాడు.

కానీ, డికాక్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడంతో అనూహ్యరీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికాతో జొహనెస్‌బర్గ్ వేదికగా తాజాగా ముగిసిన రెండో వన్డేలో జరిగిన ఈ వ్యవహారం పాక్ క్రికెట్ లవర్స్‌ని షాక్‌కి గురి చేసింది. ఫకార్ జమాన్.. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ ఫేక్ ఫీల్డింగ్ కారణంగా రనౌటయ్యాడు.
 
అయితే ఈ విషయంలో తప్పు తనదే అంటున్నాడు పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్‌. ఆ తప్పు నాదే. నేను నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న హరీస్ రవూఫ్ వైపు చూస్తున్నాను. అతడు క్రీజులో నుంచి కాస్త ఆలస్యంగా పరుగు అందుకున్నాడు. అతడు అవుటవుతాడేమో అని అనుకున్నాను. దీనిపై తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీయే తీసుకోవాలి. అయితే ఇందులో డీకాక్ తప్పు ఉందని నేను అనుకోను అని జమాన్ అన్నాడు.
 
ఈ రనౌట్‌తో జమాన్ డబుల్ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అటు సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా కూడా ఈ విషయంలో డీకాక్‌ను వెనకేసుకొచ్చాడు. కొందరు అతన్ని విమర్శించవచ్చేమో కానీ అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమేమీ కాదు. డీకాక్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మ్యాచ్‌లో మనకు ఏదీ కలిసి రానప్పుడు కాస్త భిన్నంగా ఏదైనా చేయాల్సి వస్తుంది. డీకాక్ అదే పని చేశాడు అని బవుమా అన్నాడు.
 
అటు ఈ వివాదంపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా స్పందించింది. డీకాక్ బ్యాట్స్‌మన్‌ను తప్పుదోవ పట్టించడానికి లేదా మోసం చేయడానికి ప్రయత్నించాడా అన్నది అంపైర్లే నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. బ్యాట్స్‌మన్ మోసానికి గురవడం కంటే అతన్ని మోసం చేయడానికి ప్రయత్నం జరిగితే.. దానిపై అంపైర్లే తుది నిర్ణయం తీసుకోవాలి. 
 
అదే నిజమైతే దానిని నాటౌట్‌గా ప్రకటించి.. 5 పెనాల్టీ పరుగులు ఇవ్వాలి. వాళ్లు పరుగెత్తిన 2 పరుగులు ఇవ్వడంతోపాటు తర్వాతి బంతి ఎవరు ఆడాలో బ్యాట్స్‌మెన్ నిర్ణయానికి వదిలేయాలి అని ఎంసీసీ ఓ ట్వీట్‌లో తేల్చి చెప్పింది.