మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి

మహ్మద్ షమీ డైట్ సీక్రెట్ బయటపెట్టిన ఫ్రెండ్.. రోజుకు కేజీ మటన్ ఆరగిస్తాడా?

shami
భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ డైట్‌కు సంబంధించి ఓ సీక్రెట్‌ను అతని స్నేహితుడు బహిర్గతం చేశాడు. రోజుకు ఒక కేజీ మటన్ ఆరగించకుండా షమీ ఉండలేడంటూ ఆశ్చర్యకర విషయాన్ని చెప్పాడు. మటన్ ఆరగించకుంటే షమీ బౌలింగ్ వేగం గంటకు 15 కిలోమీటర్ల మేరకు తగ్గిపోతుందన్నాడు. మడమ గాయానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకొని.. తిరిగి భారత్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా షమీ సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం అతను అనుసరించే ఆహారపు అలవాట్లపై (డైట్) అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ స్పందించాడు. 
 
మటన్ అంటే షమీకి అమితమైన ఇష్టమని, షమీ దేన్నైనా భరించగలడు, కానీ మటన్ లేకుండా ఉండలేడని ఉమేష్ కుమార్ వెల్లడించాడు. మటన్ లేకుండా ఒక్క రోజు మాత్రమే ఉండగలడని, రెండో రోజు కూడా మటన్ లేకుంటే ఇబ్బందిగా భావిస్తాడని, ఇక మూడో రోజు కూడా మటన్ తినకపోతే పిచ్చివాడిలా చేస్తాడని అన్నాడు. షమీ రోజుకు 1 కేజీ మటన్ తింటాడని, ప్రతిరోజూ మటన్ తినకుంటే అతడి బౌలింగ్ వేగం గంటకు 15 కిమీ మేర తగ్గుతుందని ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 
 
కాగా మహ్మద్ షమీ గాయం కారణంగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్లో మొత్తం 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన షమీ.. ఆ తర్వాత ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు దూరమైన విషయం తెలిసిందే.