1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (17:36 IST)

రెండో టెస్టులో ఓడిపోతే కోహ్లీ తప్పుకుంటాడేమో : మాంటీ పనేసర్

ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను కంగారు పెట్టించిన భారత క్రికెట్ జట్టు ఇపుడు స్వదేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల చేతిలో చావుదెబ్బలు తింటోంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. త్వరలోనే ఇదే వేదికపై రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ సారథ్యంలో టీమిండియా చివరిసారి టెస్టుల్లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ స్పందిస్తూ, టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్‌ సరిగ్గా ఆడలేకపోతోందని వ్యాఖ్యానించారు. కోహ్లీ సారథ్యంలో గత నాలుగు టెస్టుల్లో భారత్‌ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అదేసమయంలో రహానే ఆస్ట్రేలియా పర్యటనలో జట్టును విజయపథంలో నడిపించాడు. 

'ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్‌ కోహ్లీ ఒకడు. కానీ, అతడి నేతృత్వంలో భారత్‌ సరిగ్గా ఆడటం లేదనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో గత నాలుగు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా ఓడిపోవడం చూశాం. అదేసమయంలో కెప్టెన్‌గా అజింక్య రహానె అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి టీమ్‌ఇండియా సారథి ఇప్పుడు మరింత ఒత్తిడికి గురవుతుంటాడు. తర్వాతి మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓటమిపాలైతే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమో' అని పనేసర్ వ్యాఖ్యానించాడు. ’ అని పనేసర్‌ చెప్పుకొచ్చాడు.