శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (14:40 IST)

టీమిండియాకు కూడా చుక్కలు చూపిస్తా (Video)

ప్రపంచ కప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మాజీ క్రికెటర్ల రికార్డులు బద్ధలవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ యువ క్రికెటర్ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు.


2011లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ బ్రేక్ చేశాడు. అప్పట్లో ఆల్‌రౌండర్‌గా యువీ ఓ మ్యాచ్‌లో 50 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పగా, దాన్ని సోమవారం హసన్ అధిగమించాడు. 
 
69 బంతుల్లో 51 పరుగులు సాధించడంతో పాటు, 10 ఓవర్లు బౌలింగ్ చేసి, 29 పరుగులు మాత్రమే ఇచ్చి, ఐదు వికెట్లు తీశాడు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో షకీబుల్ పేరిట మరిన్ని రికార్డులు నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌ తరఫున ప్రపంచక్‌పలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌ షకీబల్‌ హసన్‌ నిలిచాడు. అలాగే ఈ వరల్డ్‌కప్‌లో వార్నర్‌ (447)ను వెనక్కినెట్టి అత్యధిక పరుగులు (476) సాధించిన ఆటగాడిగానూ రాణించాడు. వీటితో పాటు ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 50కి పైబడిన స్కోరును సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు. 
 
ఇకపోతే.. షకీబ్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ మాజీ చాంపియన్లను మించిపోయింది. సఫారీ కంటే ఎన్నో రెట్లు ముందుంది. ఆడుతున్న పది జట్లలో సగం జట్లను కిందికి దించేసింది. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్‌ రేసులో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్‌ తర్వాతి స్థానం ఇప్పుడు బంగ్లాదేశ్‌దే కావడం విశేషం. పాయింట్ల పట్టికలో బంగ్లా తర్వాతే మాజీ చాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్‌లు కొనసాగుతున్నాయి.
 
అలాగే జూలై 2న భారత్‌తో బంగ్లా తలపడనుంది. దాదాపు వారంకు పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించింది. ఆప్ఘనిస్థాన్‌తో విజయానంతరం షకీబ్‌ అల్‌ హసన్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తో జరిగే మ్యాచ్‌ మాకు చాలా ముఖ్యం. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు భారత్‌. వారిని ఓడించడం అంత సులువు కాదన్నాడు. 
 
ఇంకా తాము గట్టిపోటీనిస్తామని భారత్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నప్పటికీ సత్తా చాటుతామన్నాడు. తాము శాయశక్తులా పోరాడితే.. భారత్‌ను ఓడించడం సులభమేనని.. ఆ సత్తా మాకుందన్నాడు. ఈ విషయంలో తమ జట్టుపై తనకు పూర్తి విశ్వాసం వుందని షకీబ్ ధీమా వ్యక్తం చేశాడు.