ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
భార్యకు ఉద్యోగం లేకపోవడంతో, తీవ్రమైన ఒత్తిడి- ఆందోళన కారణంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. హిటాచి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజరుగా వుంటున్న రాకేష్ అనే టెక్కీ, 32 ఏళ్ల భార్య గౌరిని కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో దాచిన ఘటన సంచలనం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన రాకేష్ గత ఏడాది బెంగళూరులో తన భార్య గౌరితో కలిసి వుంటున్నాడు. ఐతే గురువారం రాత్రి దంపతుల మధ్య చెలరేగిన వివాదం ఈ హత్యకు దారితీసినట్లు చెబుతున్నారు.
బాధితురాలిని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డకన్నమ్మనహళ్లి నివాసి అయిన 32 ఏళ్ల గౌరీ అనిల్ సాంబేకర్గా గుర్తించారు. నిందితుడిని 36 ఏళ్ల రాకేష్ రాజేంద్ర ఖేద్కర్గా గుర్తించారు. ఆమె మెడ, పొత్తికడుపులో కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మొత్తం శరీరాన్ని మడిచి ట్రాలీ బ్యాగులో కుక్కాడని పోలీసులు తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా మాట్లాడుతూ, "ఈ జంట మహారాష్ట్రకు చెందినవారు. ఒక సంవత్సరం క్రితం బెంగళూరుకు మకాం మార్చారు. సూట్కేస్లో మృతదేహాన్ని కనుగొన్న తర్వాత ఇంటి యజమాని పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. మరణించిన మహిళ మాస్ మీడియాలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె భర్త రాకేష్ హిటాచి సంస్థలో పనిచేస్తున్నాడు. అతను ఇంటి నుండే పని చేస్తున్నాడు" అని అన్నారు.
నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసారు. ఉద్యోగం విషయంలో తలెత్తిన ఘర్షణ హత్యకు దారి తీసినట్లు అతడు చెప్పాడు. కోపంతో తన భార్యను చెంపపై ఒక దెబ్బ వేసాననీ, దాంతో ఆమె కత్తిని తనపైకి విసిరేసిందని చెప్పాడు. దాంతో ఆగ్రహం చెంది అదే కత్తితో ఆమెను పొడిచినట్లు నిందితుడు అంగీకరించాడు. తను కత్తితో పొడవడంతో ఆమె చనిపోయిందని తెలిపాడు. ఐతే... ఉద్యోగం లేదన్న కారణంతో హత్య చేసాడా లేదంటే మరేదైనా వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల కాల్ డేటాను పరిశీలించే పనిలో వున్నట్లు సమాచారం.