సోమవారం, 16 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (15:46 IST)

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

murder
అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఉండేందుకు రుణాలు ఇచ్చిన వారిని సైనైడ్‌తో చంపేసే ముగ్గురు లేడీ కిల్లర్స్‌ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిందితుల వివరాలు, వారు నేరాలు చేసిన విధానం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వివరిస్తూ, తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన ఎం వెంకటేశ్వరి గతంలో డబ్బులు సంపాదించేందుకు కాంబోడియా వెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె తల్లి రమణమ్మతో కలిసి నేరాలకు పాల్పడింది.
 
తల్లి, కూతురు ఇద్దరూ చుట్టుపక్కల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నమ్మించి అప్పుగా డబ్బులు తీసుకుంటారు. డబ్బు తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగిన వారికి కూల్ డ్రింక్‌లు, ఆహారం, మత్తు పానీయాల్లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేస్తారు. ఇటీవల తల్లీకుమార్తెలు ఉంటున్న ఇంటి సమీపంలో ఉండే మునుగప్ప రజినీ కూడా ఈ ముఠాలో చేరింది. ఈ ముగ్గురు మహిళలు అదే ప్రాంతంలో నివాసముండే నాగుర్ బీని జూన్ నెలలో బయటకు తీసుకొచ్చి చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లి బ్రీజర్‌లో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేశారు.
 
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులకు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మృతురాలు నాగూర్ బీ, రజని మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, వారు చెప్పిన విషయాలతో పోలీసులే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ముగ్గురూ కలిసి ఇప్పటివరకూ ముగ్గురు మహిళలు, ఒక పురుషుడికి సైనైడ్ ఇచ్చి హత్య చేసి వారి వద్ద నుండి నగదు, నగలు దోచుకున్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా మరో ముగ్గురు మహిళలను ఇదే తరహాలో సైనైడ్ కలిపి హత్య చేయడానికి ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో వారు ప్రాణాలతో బయటపడ్డారని ఎస్పీ తెలిపారు.