శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (08:47 IST)

కేరళలో 'దృశ్యం' సీన్ రిపీట్ - బావమరిదిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన బావ

deadbody
కేరళలో దృశ్యం మూవీ సీన్ రిపీట్ అయింది. బావమరిదిని చంపిన బావ.. ఆ శవాన్ని కూడా ఇంట్లోనే పాతిపెట్టాడు. ఆ తర్వాత శవం పాతిపెట్టేందుకు తీసిన ప్రాంతంలో నీట్‌గా సిమెంట్‌తో గచ్చు వేసేశాడు. ఈ దారుణం వారం రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన బిందు కుమార్ (40) అనే వ్యక్తి వారం రోజులక్రితం కనిపించకుండా పోయాడు. దీంతో అతడి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.... దర్యాప్తు ప్రారంభించారు. ఇందులోభాగంగా, బిందు కుమార్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించారు. 
 
ఇందులో బిందు కుమారు చివరిసారి కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తు కుమార్‌తో ఫోనులో మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత ముత్తుకుమార్‌ కోసం చంగనేస్సరికి వెళ్లగా అతను అక్కడ లేడు. ఇరుగుపొరుగువారి వద్ద విచారించగ, కొన్ని రోజులుగా ఇంట్లో మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు. 
 
పైగా, ఇంట్లోని ఓ ప్రాంతంలోని గచ్చు కొత్తగా కనిపించింది. దీంతో దాన్ని పగులగొట్టి చూడగా అక్కడ మృతదేహం కనిపించింది. దాన్ని వెలికి తీశారు. దాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం తరలించారు. 
 
కాగా, మృతుడు బిందు కుమార్ చెల్లిని నిందితుడు ముత్తుకుమార్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో వీరిద్దరూ స్వయానా బావాబావమరుదులు కావడం గమనార్హం. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. పరారీలో ఉన్న ముత్తు కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.