స్నేహితుడితో వున్న వైద్య విద్యార్థినిపై దాడి చేసి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ సమీపంలో ఒడిశాకు చెందిన ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన విద్యార్థిని దుర్గాపూర్ శివపూర్ ప్రాంతంలోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కళాశాల గేటు దగ్గర నుంచి ఆమె తన స్నేహితుడితో బయటకు వెళ్లింది.
ఐతే వారిని కొంతమంది దుండగులు వెంబడించారు. ఆ తర్వాత మెడికో పైన దాడి చేస్తుండగా ఆమె స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దుండగులు బాధితురాలిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని అధికారులు తెలిపారు. ఘటనపై 23 ఏళ్ల బాధిత మెడికో తండ్రి మాట్లాడుతూ, ఆమె స్నేహితుడు పారిపోయాడని, అతని ప్రమేయం కూడా ఉందని తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు.
పోలీసు ఫిర్యాదులో బాధితురాలి తండ్రి ఇలా పేర్కొన్నారు. తమ కుమార్తెను అతడు తప్పుదారి పట్టించి తప్పుడు సాకులతో ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. దాడి చేసిన దుండగులు తన కుమార్తె మొబైల్ ఫోన్ను కూడా లాక్కొని ఆమె నుండి 5 వేల రూపాయలు దోచుకున్నారని ఆయన అన్నారు. కాగా విద్యార్థిని దుర్గాపూర్లోని ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
శనివారం అధికారులు దర్యాప్తు ప్రారంభించామని, బాధితురాలి స్నేహితుడితో సహా అనేక మందిని ప్రశ్నించడం ప్రారంభించామని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కళాశాల నుండి నివేదిక కోరిందని, బాధితురాలిని మరియు ఆమె తల్లిదండ్రులను కలవడానికి జాతీయ మహిళా కమిషన్ బృందం దుర్గాపూర్కు బయలుదేరినట్లు తెలుస్తోంది.
గత ఏడాది ఆగస్టులో కోల్కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య జరిగిన సంఘటన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే.