గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

భార్యను కాపురానికి పిలిస్తే రావడం లేదు.. అక్రమ సంబంధం ఉందంటూ పురుగుల మందు తాగి..

anitha with son
తన భార్యను కలిసి జీవిద్దామంటూ పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని పేర్కొంటూ ఓ వ్యక్తి తన చిన్న కుమారుడికి పురుగుల మందు తాపించి, తాను కూడా తాగి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పెద్దరాజుపల్లి అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన అరసాని రాజు (44), అనిత అనే వారు 14 యేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అనిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి, అక్కడే ప్రైవేట్ టీచర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. 
 
ఈ క్రమంలో గురువారం తెల్లవారే సమయంలో హఠాత్తుగా ఓ చేత్తో వేట కొడవలి, మరో చేత్తో పురుగుల మందు డబ్బాను పట్టుకుని ఆగ్రహంతో ఊగిపోతూ భార్య ఉంటున్న ఇంటికి వచ్చాడు. అతని తీరును చూసిన స్థానికులు భయభ్రాంతులకుగురయ్యారు. ఆయన్ను ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో నేరుగా ఇంట్లోకి వెళ్లిన రాజు... చిన్న కుమారుడు ఉజ్వల్ (4) పడుకునివుండగా, అతడికి బలవంతంగా పురుగుల మందు తాపించాడు. ఆ తర్వాత తాను కూడా తాగి కుప్పకూలిపోయాడు. స్థానికులంతా కలిసి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించేలోపు వారు ప్రాణాలు కోల్పోయారు. బిడ్డను కోల్పోయిన అనిత బోరున విలపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.