తల్లి మందలించిందనీ ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..
హైదరాబాద్ నగరంలోని మూసాపేటలో ఓ విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు... మూసాపేటలోని యాదవబస్తీకి చెందిన తలసమ్మ, జానకీరావు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల క్రితం వారి పెద్ద కుమార్తె రమ్య (18)కు ప్రొక్లెయిన్ డ్రైవర్గా పని చేసే అశోక్ అనే యువకుడుకి ఇచ్చి వివాహం చేశారు.
ప్రస్తుతం భర్త అశోక్తో పాటు రమ్య కూడా పుట్టింటులోనే ఉంటుంది. ఈ క్రమంలో రమ్య తరచుగా ఫోనులో మాట్లాడుతుండటంతో తల్లి మందలించింది. వివాహం కూడా అయింది.. ఇక సంసార బాధ్యతలు నేర్చుకోవాలని చెప్పింది. ఆ తర్వాత తల్లీ కుమార్తెలిద్దరూ కలిసి మార్కెట్కు వెళ్లివచ్చారు. ఆ తర్వాత తల్లి బయటకు వెళ్లగా రమ్య ఒక్కటే ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
అయితే, ఇంటికి వచ్చిన తల్లి... పడక గది తలుపులు మూసి వుండటంతో కుమార్తె నిద్రపోతుందని భావించి, ఇంటి పనుల్లో నిమగ్నమైంది. రాత్రి 11.30 గంటలు అయినప్పటికీ కుమార్తె గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన తల్లి.. గది కిటికీలో నుంచి చూడగా కుమార్తె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆ తర్వాత ఇరుగుపొరుగువారి సాయంతో కిందికి దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.