1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (13:07 IST)

ఎన్నికలకు ముందు పేలిన 'పెగాసస్' - నిప్పులు చెరిగిన కాంగ్రెస్

దేశ రాజకీయాల్లో పెగాసస్ బాంబు మరోమారు పేలింది. గత యేడాదంతా పెను దుమారాన్ని రేపిన ఈ స్కామ్... తాజాగా న్యూయార్క్ టైమ్ ప్రచురించి కథనంతో మరోమారు రాజకీయ సునామీలా దేశాన్ని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌తో రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ఫోన్లను హ్యాక్ చేశారంటూ అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే జస్టిస్ రవీంద్రన్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ఇపుడు మరోమారు బాంబు పేల్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా 300మంది ఫోన్ల సంభాషణలు విన్నారని "ద వైర్" కథనాలు ప్రచురించింది. గత 2017లోనే ఈ స్పైవేర్‌ను కేంద్రం కొనుగోలు చేసిందని, ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటన సమయంలోనే దీనికి బీజం పడిందని ఆ పత్రికా కథనం పేర్కొంది. అయితే, న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని జనరల్ వీకే సింగ్ కొట్టిపారేశారు. న్యూయార్క్ టైమ్స్ ఓ సుపారీ మీడియా అంటూ మండిపడ్డారు. 
 
కాగా, దేశంలో త్వరలోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఆ పార్టీ విజయభేరీ మోగించాలన్న పట్టుదలతో ఉంది. ఈ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరోమారు పెగాసస్ పేలడం దేశ రాజకీయాల్లో పెను చర్చకు దారితీసింది. కాగా, ఈ పెగాసస్ స్పై వేర్‌ను భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా దిగుమతి చేసుకున్నట్టు సమాచారం.