గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 8 జూన్ 2021 (19:53 IST)

మంత్రుల్లో టెన్షన్ టెన్షన్, కూల్‌గా రోజా, ఎందుకంటే?

కొందరిలో వూస్టింగ్ భయాలు.. మరికొందరిలో పోస్టింగ్ ఆశలు.. ఇంతకీ ఉండేదెవరు.. ఊడేదెవరు. రెండేళ్ళు గడిచాయో లేదో అప్పుడే ఆందోళన మొదలైపోయింది. పదవి ఉంటుందో ఉండదోనన్న టెన్షన్ స్టార్టయ్యింది. ఇది ఆంధ్రప్రదేశ్ అమాత్యుల పరిస్థితి. ఇంతకీ ఇన్ ఎవరు.. అవుట్ ఎవరు..?
 
వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచింది. ఈ సంధర్భంగానే మంత్రులంతా జిల్లాల్లో కేక్‌లు కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సంబరాల ఆనందం ఇంకా ముగియనేలేదు. అప్పుడే కొంతమందిలో టెన్షన్ మొదలైంది. అదే సిఎం జగన్ పెట్టిన రెండేన్నరయేళ్ళ డెడ్ లైన్. 
 
ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే సహచర మంత్రులకు క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎవరైనా సరే రెండున్నరేళ్ళేనని ఎలాంటి విమర్సలు లేకుండా పనిచేయాలని తేల్చిచెప్పారు జగన్. ఇప్పుడు ఆ టైం దగ్గర పడుతోంది. ఇప్పటికి రెండేళ్ళు గడిచిపోయాయి. ఇంకో ఆరు నెలలే ఉంది. ఆలోపు ఎవరి పిక్చర్ ఏంటో తేలిపోతోంది.
 
ఆ రెండున్నరేళ్ళు గడువు టెన్షన్ అప్పుడే చాలామందిలో కనిపిస్తోందన్నది పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం జగన్ కేబినెట్లో 25మంది మంత్రులు ఉన్నారు. వీరిలో చాలామంది సీనియర్లు ఉన్నారు. తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. వీరిలో ఎవరు ఉంటారు. ఎవరు బయటకు వెళతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
 
అధికారంలోకి వచ్చినా ఏ ఒక్కరు తమ శాఖలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే ఏడాదిన్నర నుంచి కరోనా సంక్షోభమే కొనసాగుతోంది. దాంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. అదే చాలామందిలో ఆవేదనకు కారణంగా కనిపిస్తోందట. మంత్రుల పనితీరు, వారిలో పాలనలో పట్టుపోయి ప్రభుత్వ వర్గాల్లోను, ఇటు పార్టీలోను విస్తృత చర్చ జరుగుతోందట.
 
ఎవరు ఉంటారు.. ఎవరికి ఇబ్బంది తప్పదనేది ఎవరి వాదన వారిదే. దీనిపై మంత్రుల్లోను చర్చ జరుగుతోంది. కొందరిలో భయం కనిపిస్తుంటే మరికొందరు ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. టెన్షన్ పడుతున్న వారిలో జూనియర్లే కాదు సీనియర్లు కూడా ఉన్నారట. ఉన్న 25 మందిలో 50 శాతం మందిని ఉంచి మిగిలిన వారిని పక్కన పెడతారన్న చర్చ గట్టిగా జరుగుతోందట. 
 
కొంతమంది సీనియర్లను కీలక శాఖల్లో ఉన్న వారిని తొలిసారి మంత్రి అయిన వారిని మాత్రం కొనసాగిస్తారని తెలుస్తోంది. ఫైర్ బ్రాండ్స్‌గా పేరున్న వారిని మాత్రమే కొనసాగిస్తారన్న ప్రచారం మొదట్లో జరిగింది. కానీ పరిస్థితి మారిపోయిందని ఎవరికి షాకింగ్ న్యూస్ చెబుతారో తెలియడం లేదన్న చర్చ మంత్రుల్లో జరుగుతోందట. 
 
పదవి పోతుందనేవారు ఎంత టెన్షన్ పడుతున్నారో..కొత్తగా కేబినెట్లో వద్దామనుకునేవారు అదే ఆందోళనతో ఉన్నారట. చివరి రెండున్నరేళ్ళయినా అవకాశం వస్తుందా..రాదా అన్న టెన్షన్ వారిలో కనబడుతోందట. సిఎం జగన్ మనస్సులో ఏముందో చివరి వరకు తెలియదు. దీంతో జగన్ మనస్సులో ఎవరున్నారో తెలియక మధనపడిపోతున్నారు కొంతమంది. 
 
బయట ప్రచారంలో మాత్రం కొంతమంది పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయట. రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, నాగేశ్వరరావు, కోడుమూరు శ్రీనివాసులకు మంత్రి పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ఎవరికి మంత్రి పదవులు వస్తాయో తెలియాలంటే మరికొన్నిరోజుల ఆగాల్సిందే.