శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (14:37 IST)

వార్షిక బడ్జెట్ 2023-24 : ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి?

union budget2023
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో 2023-24 సంపత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్‌-2023 ప్రకారం.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి..? వేటిపై భారం పడనుందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
 
కెమెరా లెన్సులపై కస్టమ్స్‌ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు. టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న 5శాతం కస్టమ్స్‌ సుంకాన్ని 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం. వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం. 
 
లిథియం అయాన్‌ బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించారు. రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి.
 
అలాగే, ధరలు తగ్గేవి వస్తువులను పరిశీలిస్తే, మొబైల్‌, ల్యాప్‌టాప్‌, డీఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్సులు, టీవీ ప్యానెల్‌ పార్టులు, లిథియం అయాన్‌ బ్యాటెరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం, డైమండ్‌ల తయారీ వస్తువులు ఉన్నాయి. 
 
బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాగే, వెండి ఉత్పత్తులు, సిగరెట్లు, టైర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ చిమ్నీలు,  రాగి తుక్కు, రబ్బర్‌ వంటి వస్తువుల ధరలు పెరిగే  అవకాశం ఉంది.