1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 1 సెప్టెంబరు 2021 (21:50 IST)

మాంసాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే ఏమవుతుందో తెలుసా?

ఫ్రిజ్‌లో పండ్లని ఉంచితే ఎన్నిరోజులయినా నిల్వ ఉంటాయి అనుకొంటారు చాలామంది. కానీ వాటికీ ఒక పరిమితి ఉంది. వండిన కూరలు రెండు రోజులకు మించితే తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే పండిన నిమ్మ జాతి పండ్లు ఫ్రిజ్‌లో పదిరోజుల వరకు ఉంటే యాపిల్‌, పియర్స్‌ పండ్లు మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి.
 
టమాటాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా టమాటాలు పగిలిన చోట వృద్ధి చెందుతాయి. అందుకే వాటిని శుభ్రంగా కడిగి వంటకు ఉపక్రమించడం మేలు. మాంసాన్ని నిల్వ ఉంచే కొద్దీ అంటే ప్రతి ఇరవై నిమిషాలకు బ్యాక్టీరియా రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతుంది. చేపలు, రొయ్యలు వంటివి డీప్‌ఫ్రిజ్‌లో చిల్లర్‌లో భద్రపరచడం వల్ల కొన్ని వారాలు పాటు నిల్వ ఉంటాయి.
 
రొయ్యలనయితే పొట్టు తీసి ప్రత్యేక పాలిథీన్‌ బ్యాగుల్లో ఉంచాలి. చేపలను కూడా పొలుసు తీసి శుభ్రం చేసి చిల్లర్‌లో ఉంచితే రెండు మూడు రోజులు నిల్వ ఉన్నా కొన్ని రకాల టాక్సిన్లు విడుదలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ నిల్వ పనికిరాదు.
 
చీజ్‌, కేక్‌, గుడ్లు వంటి వాటిని ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల వద్ద ఉంచాలి. పాల ఉత్పత్తులను నాలుగు డిగ్రీల వద్ద ఉంచితే సరిపోతుంది. కాయగూరలు, ఆకుకూరలు, క్యాలీఫ్లవర్‌, యాపిల్‌, వంటి వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో ఎనిమిది నుంచి పది డిగ్రీల మధ్యలో ఉంచాలి. శీతల పానీయాలను పది నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఫ్రిజ్‌ తలుపులో ఉంచాలి.