శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (09:05 IST)

కరోనాను క్యాష్ చేసుకుంటారా? ఇది సమయం కాదు.. అలీ

Ali
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వ్యాపారులు, నిత్యావసరాలు, కూరగాయల ధరలను పెంచి... కరోనాను క్యాష్ చేసుకుంటున్నారు. 
 
దీనిపై టాలీవుడ్ హాస్య నటుడు స్పందించాడు. ఇలా రేట్లు పెంచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇచ్చిన అలీ.. ఇలా ధరలు పెంచేయడం సరికాదన్నారు. ఇది సంపాదించే సమయం కాదని, ఎంత రేటు ఉంటే అంతకే అమ్మాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
 
దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటూ, తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ వ్యాఖ్యానించారు. ఇటలీలో వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని అలీ కోరారు.
 
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై పోరు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేయడానికి గాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఏపీలోనూ కరోనా సోకకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.