1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:08 IST)

గల్ఫ్ దేశాల్లో వైద్యం,నిత్యావసరాలు మినహా అన్ని బంద్

గల్ఫ్ దేశాల్లో మరోసారి కోవిడ్ కుదుపులు ప్రారంభమయ్యాయి. ఒకదాని తర్వాత మరో దేశం వ్యాపారాలు, వేడుకలపై నిషేధం విధిస్తూ వస్తున్నాయి.

కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం, సెకండ్ వేవ్ భయం వెంటాడుతుండటంతో కువైట్ ప్రభుత్వం కూడా దాదాపుగా లాక్ డౌన్ అన్నంత రేంజ్ లో అన్ని రంగాలపై ఆంక్షలు ప్రకటించింది.

చివరికి ఈ నెలాఖరులో జరగాల్సిన జాతీయ దినోత్సవం వేడుకను కూడా రద్దు చేసింది. మెడికల్ షాపులు, నిత్యావసర సరుకులు మినహా మిగిలిన అన్ని రంగాలపై నిషేధం విధించింది.

కొన్నింటిని పాక్షికంగా మూసివేసింది. జిమ్ములు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లను పూర్తిగా మూసివేయాలని మంత్రివర్గం ఆదేశించింది.

ఇతర వాణిజ్య రంగాలకు చెందిన షాపులు, రెస్టారెంట్ రిసిప్షన్ హాల్ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచిఉంచొద్దని వెల్లడించింది.

ఈ నిషేధ ఉత్తర్వులు ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే..మూసివేత సమయాల్లో హోమ్ డెలవరీ బిజినెస్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.

ఇక పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్లకు అవకాశం లేకుండా సెలబ్రేషన్ హాల్స్, టెంట్ల నిర్వహణపై పూర్తిగా నిషేధం విధించింది. అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత క్రీడా ఫెడరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎవరైనా కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది కువైట్ మంత్రివర్గం. మరోవైపు కోవిడ్ స్ట్రెయిన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ట్రావెల్ బ్యాన్ కూడా విధించిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 7 నుంచి దేశంలోకి కువైట్ పౌరులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే..డొమస్టిక్ వర్కర్లకు, రక్త సంబంధీకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

మినహాయింపు పొందిన వర్గం వారు కువైట్ లోకి ఎంటర్ అవగానే వారి సొంత ఖర్చులపై వారం పాటు క్వారంటైన్ లో ఉండాలి. మరో వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి.