గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (15:32 IST)

మసూద్‌కు చైనా మద్దతు.. మోడీపై రాహుల్ విమర్శలు!

పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన నేపథ్యంలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలు ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. దీనిపై బుధవారం చర్చ జరగగా చివరి నిమిషంలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రతిపాదనకు సాంకేతికంగా మోకాలడ్డిన విషయం తెలిసిందే. 
 
తాజాగా, ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై పలు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్, మోడీ బలహీనమైన వ్యక్తిగా పోల్చి, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని ధ్వజమెత్తారు. ‘బలహీనమైన మోడీ జీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత్ చేస్తోన్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటే మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. చైనాతో నమో దౌత్య సంబంధం ఎలాంటిదంటే.. గుజరాత్‌లో జిన్‌పింగ్‌తో పర్యటిస్తారు.. ఢిల్లీలో జిన్‌పింగ్‌ను హగ్‌ చేసుకుంటారు... చైనాలో జిన్‌పింగ్‌ ముందు తలవంచుతారు’ అంటూ రాహుల్‌ తన ట్వీట్‌లో దుమ్మెత్తిపోసారు. 
 
మసూద్‌కు వ్యతిరేకంగా ఐరాసలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటానికి విచారకరమైన రోజు అని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈ తీర్మానాన్ని చైనా అడ్డుకోవడమంటే ఉగ్రవాదం మూలాలున్న పాక్‌తో ఆ దేశానికి వీడదీయరాని సంబంధం ఉందని స్పష్టమవుతోందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనిని ప్రధాని మోడీ దౌత్య వైఫల్య పరంపరగా పేర్కొన్నారు. 
 
మసూద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయించడంలో భాగంగా చైనా నోరు మూయించేయడం... నరేంద్ర మోడీ దౌత్య విజయం... అభినందన్‌ని పాక్‌ నుండి రప్పించడం మరో విజయంగా చెప్పేసుకుంటున్న అధికారపక్షం మరేమని బదులిస్తుందో వేచి చూడాల్సిందే... అంతేగా మరి.