మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (12:59 IST)

యూకేలో ఓ ఎన్నారై జంట పెళ్లి అదుర్స్.. డ్రైవ్ ఇన్ సినిమాలా డ్రైవ్ ఇన్ మ్యారేజ్

యూకేలో ఓ ఎన్నారై జంట పెళ్లి సూపర్‌గా జరిగింది. పెళ్లికి హాజరైన అతిథులకు ఒక కొత్త అనుభూతిని ఆ పెళ్లి మిగిల్చింది. ఎందుకంటే.. ఆ వివాహం వెరైటీగా జరగడమే. 'డ్రైవ్ ఇన్ సినిమా' స్టైల్‌లోనే 'డ్రైవ్ ఇన్ మ్యారేజ్' జరిగింది. ఈ ఎన్నారై జంట పెళ్లికి వచ్చిన అతిథులందరూ కాళ్లు కింద పెట్టకుండా తమ వాహనాల నుంచే పెళ్లిని తిలకించారు. చివరకు స్నాక్స్, భోజనాలు కూడా వారి వాహనాల వద్దకే అందించే ఏర్పాటు చేశారు పెళ్లివారు.
 
వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన భారత సంతతి జంట రోమా పోపట్, వీనల్ పటేల్ ఇలా వెరీ వెరీ స్పెషల్ వెడ్డింగ్‌తో ఒకటయ్యారు. అయితే, దీనికి కారణం అక్కడి కొవిడ్ నిబంధనలు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పెళ్లి ఫంక్షన్లకు 15 మందికి మించి హాజరు కావొద్దనే నిబంధన ఉంది. అందుకే రోమా దంపతులు కాసింత వెరైటీగా ఆలోచించారు. తమ పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు హాజరు కావాలి. అదే సమయంలో యూకే విధించిన కోవిడ్ నిబంధన అమలు కావాలి. దీంతో ఈ జంటకు వచ్చిన ఐడియా 'డ్రైవ్ ఇన్ మ్యారేజ్'. తమకు వచ్చిన ఐడియాను వధువరులిద్దరూ కుటుంబ సభ్యులకు చెప్పారు.
 
ఇంకేముంది వెంటనే దీనికోసం ఇరు కుటుంబాలు చకచకా అన్ని ఏర్పాట్లు చేశాయి. బ్రాక్టెడ్ పార్క్‌లో 500 ఏకరాల విస్తీర్ణం గల మైదానంలో శుక్రవారం ఈ వివాహం జరిగింది. దీనికి హాజరైన సుమారు 250 మంది అతిథులు తమ కార్లలో కూర్చొని పెళ్లిని తిలకించారు. వీరి కోసం ఓ పెద్ద తెరను ఏర్పాటు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం 4 గంటల పాటు ఈ వివాహం జరిగింది. 
 
పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఈ కొత్త జంట గోల్ఫ్ బగ్గీలో తిరుగుతూ అతిథులను పలకరించారు. వధువు రోమా మాట్లాడుతూ... "మాకు ఇది చాలా అద్భుతమైన రోజు. ఇలా డ్రైవ్ ఇన్ మ్యారేజ్ చేసుకోవడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పటికీ ఈ రోజు గుర్తుండీ పోతుంది" అని అన్నారు.