ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?
ఇండోనేషియాలో మరోమారు భారీ భూకంపం సంభవించింది. తులాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. అయితే, సునామీ వచ్చే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం తెలిపింది.
పశ్చిమ ఇండోనేషియాలో సోమవారం మధ్యాహ్నం 12.49 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం కారణంగా అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ భూకంపం వచ్చిన తర్వాత జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
ఇండోనేషియాను నిత్యం భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతుంటాయి. 2004లో 9.1 తీవ్రవతతో ఏర్పడిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలో 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్గా పిలిచే అగ్నిపర్వతాల జోన్గా ఉంది.