1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:35 IST)

రెండు మామిడి పండ్లు దొంగిలించాడనీ... దుబాయ్ కోర్టు ఏం చేసిందో చూడండి..

మామిడి పండ్లు ఊరించేస్తున్నాయి. ప్యాకింగ్‌లో కూడా పండిన మామిడి పండ్ల వాసన ముక్కుపుటాలను తాకేస్తుంది. ఇక మనసు ఆగనంటోంది. సీసీ కెమెరాలు చూస్తున్నాయన్న ధ్యాస లేదు. గప్‌చిప్‌గా రెండు మామిడి పండ్లు లాగేసాడు. అంతే.. లాక్కెళ్లి జైల్లో పెట్టారు. దాంతో పాటు జరిమానా కూడా విధించారు.

అయ్యో రామ తెలిసి తెలిసి కొరివితో తలగోక్కున్నానని ఇప్పుడు తల పట్టుకుంటున్నాడు మన భారతీయుడు. అరబ్ దేశాల్లో శిక్షలు కఠినంగా ఉంటాయి. చిన్న తప్పైనా క్షమించేది లేదంటూ కఠిన శిక్షలు విధిస్తుంటారు.
 
ఓ భారత కార్మికుడు దుబాయ్ విమానాశ్రయంలో పనిచేస్తున్నాడు. అతడి డ్యూటీ ప్రయాణీకుల లగేజీని కన్వేయర్ బెల్ట్‌పై లోడ్ చేయడం. ఈ క్రమంలో 2017 ఆగస్ట్ 11న ఓ ప్రయాణీకుడి లగేజీలో ఉన్న ఫ్రూట్ బాక్స్ నుంచి రెండు మామిడి పండ్లు తీసుకుని తిన్నాడు. ఎవరూ చూడట్లేదనుకుని మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాడు.

అది కాస్తా సీసీ కెమెరాలో రికార్డైంది. సిబ్బంది సమాచారం మేరకు అతడిని 2018, ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్ట్ పోలీసులు విచారించారు. ప్రయాణికుడి లగేజీ నుంచి తాను రెండు మామిడి పండ్లు తీసుకున్నట్లు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
 
తాజాగా దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు పూర్వాపరాలు విచారించి కార్మికుడు తన నేరాన్ని అంగీకరించడంతో అతడికి న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష, 5వేల దిర్హమ్స్ (మన కరెన్సీ ప్రకారం రూ.96,400) జరిమానా విధించింది.

అంతే కాదు శిక్షాకాలం పూర్తయిన తరువాత దేశం విడిచి వెళ్లాలని కూడా ఆదేశించింది. కేవలం రూ.115 విలువ చేసే మామిడి పండ్లు తీసినందుకు ఇంత పెద్ద శిక్షనా అని పాపం నెత్తీ నోరు మొత్తుకుంటున్నాడు భారతీయుడు. ఆ దేశంలో రూల్స్ అతిక్రమిస్తే విదేశీయులకైనా, స్వదేశీయులకైనా శిక్షలు అలాగే ఉంటాయి మరి.