ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (09:33 IST)

భారత్‌పై ప్రతిదాడికి చీకటి అడ్డొచ్చింది : పాక్ రక్షణ మంత్రి

భారత వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న జైషే మొహ్మద్ ఉగ్రతండాలను ధ్వంసం చేసింది. ఇందుకోసం భారత్ తన అమ్ములపొదిలో ఉన్న మిరాజ్-2000 రకం యుద్ధ విమానాలను ఉపయోగించింది. పాకిస్థాన్ ఆర్మీ మేల్కొనేలోపే పని పూర్తి చేసుకుని తిరిగి భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి. 
 
ఈ దాడిని పాకిస్థాన్ ధృవీకరిస్తూనే, భారత్‌పై మండిపడింది. కాల్పులు విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని ఆరోపించింది. ఇదే అంశంపై ఆ దేశ రక్షణ మంత్రి పర్వేజ్ ఖతక్ మాట్లాడుతూ, భారత వైమానిక దళం దాడి చేసిన సమయంలో పాక్‌ సైన్యం సర్వసన్నద్ధంగానే ఉన్నదనీ, ముఖ్యంగా, భారత్‌కు ధీటుగా సమాధానమిచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకుని ఉన్నారన్నారు.
 
కానీ, భారత్ వైమానికి దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ ఆర్మీకి చీకటి అడ్డొచ్చిందని సెలవిచ్చారు. భారత్‌ దాడులను తిప్పికొట్టేందుకు తమకు చీకటి అడ్డు రావడంతోనే తమ సైన్యం ఏమి చేయలేకపోయారంటూ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఆయన చెప్పుకొచ్చారు. భారత దాడిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆ దేశ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ యేడాదిలో అత్యుత్తమ జోక్ ఇదేనంటూ పాక్ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.