గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:25 IST)

కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఫేస్‌బుక్.. ఎలా?

సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలను విస్తృతం చేసాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో రకరకాల పేజీలు సృష్టించి ప్రచారాలను వినియోగిస్తున్నారు. అయితే ఊహించని విధంగా కాంగ్రెస్‌కు ఫేస్‌బుక్ షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్లుగా ఉన్న 687 నకిలీ ఫేస్‌బుక్ పేజీలను గుర్తించి తొలగించింది ఆ సంస్థ. ఎన్నికల సమయంలో నకిలీ ఖాతాలు ఎక్కువై పోతుండటంతో ఆ విషయంపై దృష్టి సారించిన ఫేస్‌బుక్ ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది. ఈ నకిలీ పేజీల్లో వివిధ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలున్నాయని ఫేస్‌బుక్‌ పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో ప్రవర్తన సరిగా లేకపోతే ఎలాంటి వారి ఖాతాలైనా తొలగిస్తామని ఫేస్‌బుక్‌ సోమవారం తేల్చి చెప్పింది. 
 
ఈ విషయంపై ఫేస్‌బుక్‌ సైబర్‌ సెక్యూరిటీ అధికారి నేథనియల్‌ గ్లైచర్‌ మాట్లాడుతూ ‘కొందరు పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. మా సంస్థ భావ వ్యక్తీకరణను ప్రోత్సహిస్తుంది, అయితే అది ఇతరులపై ప్రభావం చూపకుండా ఉండాలి. ఖాతాదారులు పెట్టే పోస్టుల ద్వారా ఎవరికైనా నష్టం వాటిల్లితే అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నకిలీ ఖాతాల ద్వారా విద్వేషం సృష్టించాలనుకునే ఎవ్వరినీ వదిలిపెట్టం. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇటీవల నిర్వహించిన సర్వేలో అనేక నకిలీ ఖాతాలు బయటపడ్డాయి. అందులో 687 పేజీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధమున్న వ్యక్తులవి అనే విషయం నిర్ధారితమైంది. అందువల్ల వాటిని తొలగించాం’ అని తెలిపారు.