1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (19:49 IST)

భారత్‌లో ప్రారంభమైన ఐఫోన్-15 విక్రయాలు.. క్యూ కట్టిన కస్టమర్లు

iPhone15
భారత్‌లో యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు శుక్రవారం నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఐఫోన్ స్టోర్లకు క్యూ కట్టారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్‌లోని యాపిల్ బీకేసీ స్టోర్‌తో పాటు ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌లో ఉన్న యాపిల్ సాకేత్ స్టోర్‌ ముందు యాపిల్ ఐఫోన్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. 
 
యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 15 సిరీస్‌ను సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్‌ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌. భారత్‌ మార్కెట్లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఐఫోన్ 15 ప్లస్‌ రూ.89,900 కాగా, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను రూ.1,59,900కి విక్రయించనుంది.  
 
లాంఛ్‌ ఆఫర్‌ కింది హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో ఐఫోన్ 15 సిరీస్‌ను కొనుగోలు చేసేవారికి ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఐఫోన్ 15  ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ కొనుగోలు చేసేవారికి రూ.6,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. 
 
ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌పై రూ.5,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతోపాటు పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ట్రేడ్‌-ఇన్‌ బెనిఫిట్‌ కింద డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లు ఐఫోన్ 15 అమ్మకాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.