శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:05 IST)

గూగుల్, ఆపిల్ స్టోర్‌ల నుంచి మాయమైన 'టిక్ టాక్'

చైనాకు చెందిన ‘టిక్‌టాక్‌’ యాప్‌పై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు నిషేధం విధించగా, ఆ నిషేధం అలాగే కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్ యాప్‌ స్టోర్ల నుంచి టిక్ టాక్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భారత్‌లో ఆ రెండు అప్లికేషన్ స్టోర్ల నుంచి ఈ యాప్‌ను తొలగించారు. 


స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న ఫీచర్లను ఉపయోగించుకుని యూజర్లు ఈ యాప్‌ ద్వారా చిన్నపాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసేవారు. అయితే కొందరు ఈ వీడియోలను దుర్వినియోగం చేస్తూ కొందరిపై లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అభ్యంతరాలు తెలియజేసారు.
 
టిక్ టాక్ అప్లికేషన్ యువతను పెడదారి పట్టిస్తోందని, దీని వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలుపుతూ వెంటనే నిషేధం విధించాలని మధురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం దీన్ని నిషేధిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, మద్రాస్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆ యాప్‌ ప్రతినిధులు సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేశారు. తాజాగా వారి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం గూగుల్‌, ఆపిల్ సంస్థలకు లేఖలు రాయడంతో ఈ యాప్‌లను వాటి ప్లే స్టోర్‌ల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ‘టిక్‌టాక్‌’ యాప్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.