శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (08:46 IST)

"మూన్‌లైటింగ్" ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం విప్రో

Wipro
దేశంలోని టెక్ కంపెనీల్లో ఒకటైన విప్రో.. ఉద్యోగులకు తేరుకోలోని షాకిచ్చింది. ఇతర కంపెనీల కోసం పని చేసే తమ ఉద్యోగుల్లో 300 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఒకే సమయంలో ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడాన్ని (మూన్‌‌లైటింగ్‌) సహించేది లేదని ఇటీవల ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు ప్రకటించిన సంగతి విదితమే. 
 
తాజా చర్యతో ఉద్యోగులకు తన కఠిన వైఖరిని విప్రో స్పష్టం చేసినట్లయ్యింది. విప్రోలో ఉద్యోగం చేస్తూ, పోటీ సంస్థల కోసమూ పనిచేసే వారికి తమ వద్ద స్థానం లేదని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ తేల్చి చెప్పారు. మూన్‌ లైటింగ్‌ ప్రక్రియ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైనదిగా అభివర్ణించారు. 
 
'వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కారణంగా విప్రో ఉద్యోగుల్లో కొందరు పోటీ సంస్థలకూ ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో ఇలా పనిచేస్తున్న 300 మందిని గుర్తించాం. వీరిని విధుల నుంచి తొలగించాం" అని ఏఐఎంఏ కార్యక్రమంలో రిషద్‌ వెల్లడించారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం మోసంతో సమానమన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రిషద్‌ స్పష్టం చేశారు.