శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (15:40 IST)

ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఖంగుతిన్న కాంగ్రెస్... సంకీర్ణ ప్రభుత్వాలకు గండం?

సార్వత్రిక ఎన్నికలపై తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి కాంగ్రెస్ ఖంగుతింది. దాదాపుగా అన్ని సంస్థలూ ఒకే తరహా ఫలితాలనే వెల్లడించాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని, రెండోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేటతెల్లం చేయడంతో కాంగ్రెస్ పెద్దలు డోలాయమపంలో పడిపోయారు. పైగా, ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు దేశంలో ఉన్న కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలకు కూడా వణుకు పుట్టిస్తున్నాయి. 
 
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ముఖ్యంగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. 
 
ఈ రాష్ట్రం అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 113 సీట్లు రాగా, బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. బీఎస్పీ రెండు, ఎస్పీ ఒక్కో స్థానంలో గెలిచాయి. మరో నాలుగు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. అసెంబ్లీ ఫలితాలు రాగానే ఎస్పీ, బీఎస్పీలు మద్ధతు ప్రకటించడంతో కాంగ్రెస్‌ ఎంపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికితోడు స్వతంత్రులు కూడా కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. 
 
కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఏన్డీయేకు అనుకూలంగా రావడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులుకదుపుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలతో బీజేపీ పవర్‌ పాలిటిక్స్‌ ప్రారంభించింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని గవర్నర్‌‌కు బీజేపీ లేఖ రాయడం హాట్‌ టాఫిక్‌‌గా మారింది. పలు సమస్యలపై అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్‌‌కు లేఖ రాసినట్లు మధ్యప్రదేశ్‌ ప్రతినక్ష నేత గోపాల్‌ భార్గవ్‌ తెలిపారు. ఈయన త్వరలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని ప్రకటన కూడా చేశారు. 
 
గవర్నర్‌‌కు లేఖతో ఎంపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్లాన్‌ చేసినట్లు కనిపిస్తోంది. గవర్నర్‌ అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడేలా ఉంది. ప్రభుత్వ బలనిరూపణలో బీజేపీ గట్టేక్కేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.